కేసీఆర్ పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం
కేసీఆర్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం కురిపించారు.
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరమైనవని లక్ష్మీనారాయణ అన్నారు.
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయుల కాలంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అప్పట్లోనే గొలుసుకట్టు చెరువులను నిర్మించి పంటలకు సాగునీరందించేందుకు కృషి చేశారని తెలిపారు. అలాంటి చెరువులను అభివృద్ధి చేసి.. నీటి నిల్వలను పెంచేలా మిషన్ కాకతీయ పథకం చేపట్టడం గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు.
వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వడం అభివృద్ధికి కీలకమని, సాగు రంగం అభ్యున్నతి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించనందువల్లే ఏడేళ్ల ముందుగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశానని తెలిపారు. తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారమంతా సత్యదూరమేననిని స్పష్టం చేశారు. అవసరమైన సమయంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు.