ఆయన మాజీ ముఖ్యమంత్రి తనయుడు... మాజీ మంత్రి కూడా... కానీ అతి సామాన్యుడిలా ఓ రోడ్డుపక్కన హోటల్లో మిర్చీ బజ్జీలు తిని అందరినీ ఆశ్చర్యపర్చారు. ఆయనెవరో కాదు మాజీ మంత్రి కేటీఆర్.  

కరీంనగర్ : చల్లటి వాతావరణంలో గరంగరం మిర్చి బజ్జీలు తింటే ఆ మజాయే వేరు. ఈ అనుభూతిని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొందారు. ఏమాత్రం మొహమాటం లేకుండా రోడ్డుపక్కన చిన్న హోటల్లో వేడివేడి మిర్చిబజ్జీలు తిని ఛాయ్ తాగారు కేటీఆర్. బాస్ తో పాటే బిఆర్ఎస్ నాయకులు కూడా మిర్చీ బజ్జీల రుచిచేసారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే... బుధవారం కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ... కరీంనగర్ లో పార్టీని ఎలా గెలిపించుకోవాలి అన్నదానిపై చర్చించారు. ఇలా సాయంత్రం వరకు కరీంనగర్ లోనే వున్న కేటీఆర్ రాత్రి హైదరాబాద్ కు తిరుగుపయనం అయ్యారు.

అయితే రాత్రి సమయంలో ప్రయాణం... వాతావరణం చల్లగ వుంది... దీంతో కేటీఆర్ కు ఏదయినా గరంగరంగా తినాలి అనిపించినట్లుంది. దీంతో వెంటనే మానుకొండూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి వద్ద కారు ఆపారు. రోడ్డుపక్కన ఓ చిన్న హోటల్లోకి వెళ్లి అప్పుడే వేసిన గరంగరం మిర్చీబజ్జీలు అడిగి తీసుకున్నాడు. తన వెంటవున్న నాయకులను కూడా బజ్జీలు తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎంపీ వినోద్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా మిర్చీ బజ్జీలు రుచిచూసారు. 

Scroll to load tweet…

ఎంతో ఇష్టంగా మిర్చీ బజ్జీలు తిన్న కేటీఆర్ హోటల్ నిర్వహకులను అభినందించారు. బజ్జీలు చాలా రుచికరంగా వున్నాయన్న కేటీఆర్ ఛాయ్ కూడా తాగారు. కేటీఆర్ తమ హోటల్ కు రావడంపట్ల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి అయినప్పటికీ అత్యంత సామాన్యుడిలా కేటీఆర్ వ్యవహరించారని కొత్తపల్లివాసులు అంటున్నారు.