టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలనే మా డిమాండ్ ను కూడా వెకిలిగా మాట్లాడటం ఉద్యమకారుల మీద గన్ ఎత్తిన రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. 60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో , పార్లమెంట్ లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లుపై వారి అధిష్టానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా అని కవిత ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ , గాంధీ భవన్ గాడ్సే అయిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని ఎద్దేవా చేశారు. 

Scroll to load tweet…

ఉత్తరప్రదేశ్‌లో 33% సీట్లను మహిళలకు కేటాయించామని సొల్లు కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారన్నది గుర్తుంచుకోవాలన్నారు. గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, ముగ్గురు గెలవగా, 18 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చిందని దుయ్యబట్టారు. తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు నీతులు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ వాడుకుందని కవిత ఆరోపించారు. 

మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలనే మా డిమాండ్ ను కూడా వెకిలిగా మాట్లాడటం ఉద్యమకారుల మీద గన్ ఎత్తిన రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రం అయినా, మహిళలకు దక్కాల్సినన్ని స్థానాలు దక్కడం లేదనదే మహిళల ఆవేదన అని కవిత వ్యాఖ్యానించారు.

రాజ్యంగపరంగానే మహిళల హక్కులు అమలు కావాలని... దానికి చిత్తశుద్దితో అన్ని పార్టీలు కలిసి రావాలని కవిత డిమాండ్ చేశారు. తాను ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపానని ఆమె గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదని, కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదని కవిత ధ్వజమెత్తారు.