పెళ్లైన కొద్ది గంటలకే వరుడు ఆత్మహత్య..!
అదే రోజు రాత్రి వారిద్దరికీ తొలిరాత్రి కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు... వరుడు కనిపించడం లేదనే వార్త బయటకు వచ్చింది.
అతను కొత్త జీవితంలోకి అడుగుపెట్టి కొన్ని గంటలు కూడా కావడం లేదు. అంతలోనే అనంతలోకాలకు చేరుకున్నాడు. మధ్యాహ్నం పెళ్లి చేసుకున్న వరుడు.. రాత్రికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వడ్డేపల్లి మండలం తనగలకు చెందిన సూర్యబాబు(24), అయిజ మండలం సంకాపురానికి చెందిన యువతిని ఆదివారం మధ్యాహ్నం పెళ్లి చేసుకున్నాడు. అదే రోజు రాత్రి వారిద్దరికీ తొలిరాత్రి కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు... వరుడు కనిపించడం లేదనే వార్త బయటకు వచ్చింది.
వధువే స్వయంగా.. అత్తమామల వద్దకు వచ్చి.. వరుడు కనిపించడం లేదని చెప్పింది. వారు ఇంటి పరిసరాలను పరిశీలించగా పక్కగదిలో సూర్యబాబు ఉరేసుకుని చనిపోయి కన్పించాడు. వెంటనే పుట్టినింటికి సమాచారం అందించిన పెళ్లికూతురు తమ వారు తీసుకొచ్చిన వాహనంలో స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఈ విషయమై సూర్యబాబు కుటుంబసభ్యులు శాంతినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.