ఉద్యోగాల భర్తీ: తెలంగాణలో బీజేవైఎం కార్యకర్తల కలెక్టరేట్ల ముట్టడి
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే వైఎస్ షర్మిల నిరుద్యోగుల ఆత్మహత్యలపై నిరాహార దీక్షకు దిగగా.. ఇటు బీజేపీ అనుబంధ బీజేవైఎం కార్యకర్తలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు.
తెలంగాణలో ఖాళీగా వున్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. హైదరాబాద్లో బీజేపీ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీసుకు ర్యాలీగా వెళ్లారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు దాటుకుని కలెక్టరేట్ వైపుకు బీజేవైఎం కార్యకర్తలు దూసుకెళ్లేందుకు యత్నించారు. వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడంతో కొందరు నేతలు వెళ్లి కలెక్టర్ను కలిశారు. అటు కరీంనగర్ జిల్లాలోనూ బీజేవైఎం ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ ముట్టడికి వెళ్లిన యువ మోర్చా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలోనూ కలెక్టరేట్ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు.