BJP  Tarun Chugh: తెలంగాణ పోలీసులపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్​చుగ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. పోలీసులు ఖాకీ డ్రెసు బదులు గులాబీ డ్రెస్ వేసుకుని విధులు నిర్వర్తించాల‌ని విమ‌ర్శిచారు.   

BJP Tarun Chugh: తెలంగాణ పోలీసులు కొంత మంది నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ తరుణ్‌చుగ్‌ ఆరోపించారు. మొన్న‌టి వ‌ర‌కూ 
 తీన్మార్‌ మల్లన్నను ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని ఆయన గుర్తు చేశారు. తాజాగా.. బండి సంజయ్‌ని టార్గెట్ చేశార‌ని , ఆయ‌న‌ను గ్యాంగ్‌స్టర్ ను అరెస్టు చేసిన‌ట్టు ఆయ‌న‌ను అరెస్టు చేశారని విమ‌ర్శించారు.

కొందరు పోలీసు అధికారులు ఖాకీ వ‌దిలి గులాబీ కండువాలు కప్పుకున్నట్లు కార్య‌క‌ర్త‌ల ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్ర‌తి ప‌క్ష నాయ‌కులపై కావాల‌ని తప్పుడు కేసులు పెడుతున్నార‌నీ, ఇది బ్రిటిష్‌ పాలన కాదని గుర్తుంచుకోవాలని విమ‌ర్శించారు. బండి సంజయ్‌ విషయంలో కోర్టులో మాకు న్యాయం జరిగిందని తరుణ్​చుగ్ వెల్లడించారు. ​ 

తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో అరాచక పాలన సాగుతోంద‌ని విమ‌ర్శించారు. ఎంత మంది బీజేపీ కార్యకర్తలను జైలులో పెట్టుకోండని సీఎం కేసీఆర్ కు స‌వాల్ విసిరారు త‌రుణ్ చుగ్. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి న‌మ్మ‌క‌ముంద‌ని, ఖ‌చ్చితంగా కేసీఆర్ కుటుంబ పాలన ను ఎండగ‌డుతామ‌ని సవాల్ విసిరారు. తాము ప్రజ స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామ‌ని తెలిపారు. తెలంగాణ‌లో గ‌డిలా పాల‌న జ‌రుగుతోంది. కేసీఆర్ నివాసాన్ని రాజప్రసాదంలా భావిస్తున్నారని విమ‌ర్శించారు. టీచర్లు, విద్యార్థుల హక్కుల కోసం మా పోరాటం ఆగదు. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంద‌ని అన్నారు.అలాగే.. సంజయ్‌ విషయంలో పార్టీ పోరాడుతూనే ఉంటుంద‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యంపై ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడాడు. సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో అరెస్టు చేసినా.. హైకోర్టు తీర్పు ఇచ్చిందని లక్ష్మణ్‌ విమర్శించారు. ఈ విష‌యంలో సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను రాజకీయంగా ఎదుర్కొలేక.. వారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని లక్ష్మణ్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. పోలీసులు పార్టీ కార్యకర్తలు కాద‌ని.. ఆ విష‌యాన్ని గుర్తుపెట్టుకోవాల‌ని అన్నారు. 

బీజేపీ చేప‌ట్టిన‌ ధర్మ యుద్ధంలో ధర్మమే గెలిచిందనీ. బీజేపీ నేత‌లపై తప్పుడు కేసులు పెడుతున్నార‌నీ, అలా ఎన్ని కేసులు పెట్టిన తాము భ‌య‌ప‌డ‌మ‌ని తెల్చి చేప్పారు. హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు, ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిదని విమ‌ర్శించారు. నైతిక బాధ్యత వహించి కేసీఆర్‌ రాజీనామా చేయాలనీ, రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు, అరెస్టులతో భాజపా పోరాటాన్ని ఆపలేరని స్ప‌స్టం చేశారు.