మద్యం అమ్మకాల్లో దేశంలో నెంబర్ వన్: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈటల ఫైర్
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కేసీఆర్ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ఫోకస్ పెట్టిందని, మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానానికి వెళ్లిందని అన్నారు.
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. ముఖ్యంగా మద్యం అమ్మకాలను పేర్కొంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నదని అన్నారు. ప్రతి వాడకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు కలకలాడిపోతున్నాయని పేర్కొన్నారు.
కూకట్పల్లిలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఇంటింటికి బీజేపీ పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర 50 రోజులకు చేరింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని దుయ్యబట్టారు. అందుకే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం, అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.త