బీజేపీది వాపో బలుపో రాహుల్ కు తెలుసు: కోమటిరెడ్డికి మురళీధర్ రావు కౌంటర్
మరోవైపు బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై సెటైర్లు వేశారు. బీజేపీది వాపో.. బలుపో రాహుల్గాంధీకి తెలుసునన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
యాదాద్రి : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. కాంగ్రెస్ నిలబడే పార్టీ కాదని కనుమరుగయ్యే పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ చీకటిమయం చేశారంటూ విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. టీఆర్ఎస్ పార్టీ అవినీతిమయమైన పార్టీ అంటూ ఆరోపించారు. ప్రశ్నిస్తుంటే దాడులకు పాల్పుడోతందని హత్యలు చేస్తోందని మండిపడ్డారు.
బీజేపీ నేతలపై దాడులకు పాల్పడినా, హత్యలు చేసినా తమ పోరాటం ఆగదన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు పేపర్ల వరకే పరిమితమయ్యాయని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత బీజేపీకే దక్కుతుందని చెప్పుకొచ్చారు.
మరోవైపు బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై సెటైర్లు వేశారు. బీజేపీది వాపో.. బలుపో రాహుల్గాంధీకి తెలుసునన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా స్పందించారు. కర్ణాటకలో రెండు పార్టీల కూటమి వల్ల ప్రజలకు న్యాయం జరగదన్నది తాజా పరిణామాలతో రుజువైందన్నారు. కర్ణాటక విషయం స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉందని మురళీధర్ రావు స్పష్టం చేశారు.