ఖమ్మంలో జరుగుతున్న కాంగ్రెస్ జనగర్జన సభకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత నిరంకుశత్వాన్ని చూడలేదని.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే పోలీసులు ఇలా చేస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు

ఖమ్మంలో జరుగుతున్న కాంగ్రెస్ జనగర్జన సభకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించడంపై హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తమ సభకు అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదన్నారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలకు పోరాటాలు, ధర్నాలు, సభలు నిర్వహించుకునే హక్కు వుందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. డబ్బులు ఇస్తామన్నా ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదని.. ప్రైవేట్ వాహనాల్లో సభకు వెళ్దామన్నా అడుకుంటున్నారని వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ జనగర్జన సభకు భయపడే ప్రభుత్వం బస్సులు ఇవ్వడం లేదని.. ప్రైవేట్ వాహనాలను కూడా అడ్డుకుని సీజ్ చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇంతలా కక్షగట్టి జనాన్ని సభకు రాకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. 

మూడు దశాబ్ధాల తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదని.. ఇప్పుడు జరిగే ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత నిరంకుశత్వాన్ని చూడలేదని.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే పోలీసులు ఇలా చేస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. గడిచిన 9 ఏళ్లుగా కాంగ్రెస్ శ్రేణులను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, అయినప్పటికీ తాము ఏనాడూ హద్దు మీరలేదన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు సభకు వస్తుండటం చూసి ప్రభుత్వం తట్టుకోలేకపోతోందని వెంకట్ రెడ్డి దుయ్యబట్టారు. 

Also Read:కాంగ్రెస్ సభకు అడ్డంకులు : రోడ్డుపై బారికేడ్లను నెట్టిపారేసిన రేణుకా చౌదరి.. నువ్వు ఎవడ్రా అంటూ పోలీసులపై ఫైర్

మరోవైపు.. రాహుల్ గాంధీ సభకు ఎలాంటి ఆటంకాలు కల్పించడం లేదని ఖమ్మం సీపీ విష్ణు వారియర్ ప్రకటించారు. ఇవాళ ఖమ్మంలో రాహుల్ గాంధీ సభకు వచ్చే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీజీపీ అంజనీకుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. తమ సభకు రాకుండా వాహనాలను అడ్డుకోవడం సరైంది కాదని రేవంత్ రెడ్డి చెప్పారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల చెక్ పోస్టులు, రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు సుమారు 1700 వాహనాలను పోలీసులు సీజ్ చేశారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆందోళనకు దిగారు. రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లను మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి తొలగించారు. పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై ఖమ్మం సీపీ విష్ణు వారియర్ స్పందించారు. కాంగ్రెస్ సభకు ఆటంకాలు సృష్టించడం లేదని .. పూర్తి భద్రత కల్పిస్తున్నామన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు.