ఇన్ఛార్జ్ కూడా జిల్లాల్లో తిరగాలి.. 50 శాతం టిక్కెట్లు ముందే కన్ఫర్మ్ చేయాలి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావ్ థాక్రేతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. ఎన్నికలు 15 రోజులు వుండగా టికెట్లు ఇవ్వడం సరికాదని.. గాంధీ భవన్కి రావడం తగ్గించి, నియోజకవర్గంలో ఎక్కువ సమయం వుండాలని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

జనవరి 26 నుంచి జరగనున్న కార్యక్రమాలను ఏ విధంగా సక్సెస్ చేయాలన్న దానిపై మాణిక్ రావు థాక్రేతో చర్చించినట్లు తెలిపారు టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఏ సమయంలోనైనా మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం వుందన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ, విశ్వాసం వుందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేసేందుకు కృషి చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. అంతర్గత విషయాలను పక్కనబెట్టి.. 60 నుంచి 70 శాతం ఎమ్మెల్యే అభ్యర్ధులను ముందుగానే డిసైడ్ చేయాలని ఆయన కోరారు. ఎన్నికలు 15 రోజులు వుండగా టికెట్లు ఇవ్వడం సరికాదని.. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి ఎప్పుడో తీసుకెళ్లానని కోమటిరెడ్డి చెప్పారు.
పోటీ వున్న చోట నేతలను కూర్చోబెట్టి మాట్లాడాలని , ప్రభుత్వం వస్తే వాళ్లలో ఒకరికి ఎమ్మెల్సీ, నామినేటెడ్, ఛైర్మన్ పోస్టు ఇస్తామని హామీ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించాలని కోమటిరెడ్డి అన్నారు. నేతలకు అన్ని రకాలుగా అండగా వుండి ప్రజా ఉద్యమాలు చేయాలని కోమటిరెడ్డి కోరారు. 9 ఏళ్ల నుంచి డీఎస్సీ లేదని ఆయన మండిపడ్డారు. గాంధీ భవన్కి రావడం తగ్గించి, నియోజకవర్గంలో ఎక్కువ సమయం వుండాలని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ కూడా జిల్లాల వారీగా తిరగాలని చెప్పానని కోమటిరెడ్డి తెలిపారు. జనసమీకరణ చేసి ఉద్యమాలు చేయాలని చెప్పానని.. హాత్ సే హాత్ జోడో ఎలా చేయాలనే దానిపై చర్చించామన్నారు . పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలని.. అంతర్గత అంశాలు పక్కనబెట్టి అభ్యర్ధులను ఎంపిక చేయాలని కోరానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ALso REad: నాకు గౌరవం ఇవ్వాలి.. అప్పుడే పనిచేస్తా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అంతకుముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్కు వచ్చారు. అంతేకాదు.. గత కొంతకాలంగా ఉప్పు నిప్పులా వున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ మెట్లు ఎక్కనని తాను అనలేదన్నారు. కొత్త ఇన్ఛార్జ్ ఆహ్వానించడంతో వచ్చానని ఆయన తెలిపారు. గాంధీ భవన్తో తనకు 30 ఏళ్ల అనుబంధం వుందన్నారు. 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలి అనే అంశంపై చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు.