బీసీల కోసం త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెడతామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య. బీసీల కోసం రాజకీయ పార్టీ పెట్టాలని ప్రతిపాదనలు వస్తున్నాయని.. దీనిపై త్వరలోనే అన్ని కులాలతో సమావేశం అవుతానని ఆయన తెలిపారు. 

బీసీల కోసం త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తానని సంచలన ప్రకటన చేశారు బీసీ సంక్షేమ సంఘం (bc welfare association) జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (r krishnaiah) . బీసీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని.. రాజ్యాధికారం వస్తేనే బీసీలు అభివృద్ధి చెందుతారని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో అన్ని కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి.. ఏకాభిప్రాయం వస్తే పార్టీపై ప్రకటన చేస్తానని ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీల కోసం రాజకీయ పార్టీ పెట్టాలని ప్రతిపాదనలు వస్తున్నాయని ఆయన తెలిపారు. 

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం ఐఏఎస్ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్ కృష్ణయ్య. తెలంగాణలో ఐఏఎస్ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. అధికారాలను మరిచిపోతున్నారని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఉద్యోగాన్ని, పాలనను మర్చిపోయి కోట్ల రూపాయాలను సంపాదించే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

అధికారం ఉంది కదా అని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలకు చదువులు చెప్పే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో టీచర్లుగా పనిచేస్తున్న 950 మంది అధ్యాపకులను, ఉపాధ్యాయులను అకారణంగా తొలగించారని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్‌లపై ప్రధాని మోడీ , ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు ఫిర్యాదు చేయనున్నట్లు కృష్ణయ్య తెలిపారు. అంతకుముందు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో తొలగించిన ఉపాధ్యాయులతో కలిసి ఆర్ కృష్ణయ్య ధర్నా నిర్వహించారు.