తెలంగాణ బీజేపీ‌లో కీలక పరిణామాం చోటుచేసుకుంది. గత  కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారం నిజమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి రాజీనామా చేశారు.

తెలంగాణ బీజేపీ‌లో కీలక పరిణామాం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారం నిజమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి రాజీనామా చేశారు. ఈరోజు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన అనంతరం.. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటూ రాజీనామా చేశారు. అయితే ఆయనకు మరో రకంగా కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టుగా బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక, తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను బీజేపీ అధిష్టానం నియమించింది.

ఇక, ప్రధాని మోదీ ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత.. పార్టీలో సంస్థాగత మార్పులతో పాటు, కేబినెట్ పునర్వవ్యవస్థీకరణపై దృష్టి సారించారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలోనే పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. మొత్తం నాలుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను బీజేపీ అధిష్టానం మార్చింది. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డిని, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని, జార్ఖండ్ బీజేపీ చీఫ్‌గా బాబులాల్ మరాండీని, పంజబ్ బీజేపీ చీఫ్‌గా సునీల్ జాఖర్‌ను నియమించింది. ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ కేంద్ర కార్యావర్గంలో చోటు కల్పించారు.