తెలంగాణ సీఎం కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నానని చూపెట్టాడనికే సభ పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. కేసీఆర్ మాటలను ప్రజలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నానని చూపెట్టాడనికే సభ పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. శనివారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్పై సంజయ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఎన్ని చేసినా బీజేపీని ఏమి చేయలేరని అన్నారు. జనగామలో సీఎం సభ అనగానే.. బీజేపీ నాయకులను రెండు రోజుల నుంచే అరెస్ట్ చేశారని అన్నారు. లాఠీ దెబ్బలు తగిలినా తమ కార్యకర్తలు భయపడటం లేదని చెప్పారు.
కేసీఆర్ పబ్లిక్ మీటింగ్లు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం సభ అంటే రాష్ట్రంలో ఏం అభివృద్ది జరిగిందో చెప్పాలని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ సభలో బీజేపీ నాయకులను టార్గెట్ చేసి విమర్శలు చేశారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఒక చెల్లని రూపాయి అని విమర్శించారు. కేసీఆర్ మాటలను ప్రజలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణలు చేప్తారని ఆశించినట్టుగా బండి సంజయ్ చెప్పారు.
రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని చెప్పడానికే సభలు పెడుతున్నారని విమర్శించారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా..?, అంబేడ్కర్ రాజ్యాంగం కావాలా..? అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలని బండి సంజయ్ కోరారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శలు చేశారు. కేసీఆర్ ఎన్ని చేసిన బీజేపీని ఏం చేయలేరని బండి సంజయ్ చెప్పారు.
పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించినా తెలంగాణలో ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. పోలాల దగ్గర మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడ చెప్పిందో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక.. బహిరంగ సభల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తామని.. సీఎం కేసీఆర్ కోసం ఈ స్కీమ్ తప్పక తీసుకోస్తామని వ్యాఖ్యానించారు.
