రాజకీయాల్లో ప్రతిపక్షాలుగా దుమ్మెత్తిపోసుకున్నా.. ఆపద వచ్చినప్పుడు కలిసిపోవాలి. అదే చేశారు.. బండి సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి. రాజకీయాలు పక్కన పెట్టి తమ సన్నిహితుడి మృతికి పాడె మోసి నివాళులర్పించారు. 

హుజురాబాద్ : తెలంగాణలోని హుజురాబాద్ లో ఓ మానవీయ దృశ్యం వెలుగు చూసింది. నిత్యం రాజకీయాలతో ఒకరి మీద ఒకరు చెలరేగిపోయే బీజేపీ నేత బండి సంజయ్, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిలు ఒకచోట కనిపించారు. అంతేకాదు.. రాజకీయాలను పక్కనపెట్టి 
పాడె మోశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బీఆర్ఎస్ నాయకుడు నందగిరి మహేందర్ రెడ్డి గుండెపోటుతో హాఠాన్మరణం పాలయ్యారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. ఆయన ఇటు బండి సంజయ్ కి, అటు పాడి కౌశిక్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. దీంతో వీరిద్దరూ వేర్వేరుగా అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ తర్వాత తమ ఆప్తుడి పాడెను మోసి మానవత్వాన్ని చాటుకున్నారు. 

ఆ సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి పక్కపక్కనే నిలబడి పాడె మోసిన ఘటన.. అంతటి విచారంలోనూ అందరినీ అబ్బురపరిచింది. నందగిరి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరకముందు రెండు దశాబ్దాల పాటు ఏబీవీపీ, బీజేపీల్లో పనిచేశారు. అలా బండి సంజయ్ కు సన్నిహితుడిగా ఉన్నారు. 

ఆ తరువాత ఆయన 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి.. మహేందర్ రెడ్డి సన్నిహితుడిగా మారిపోయారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. దీనికి కౌశిక్ రెడ్డి, బండి సంజయ్ లు హాజరయ్యారు. ఇద్దరూ కలిసి పక్కపక్కనే పాడె మోయడం ఇప్పుడు అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.