హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్డు కూడలిలో నిర్మాణంలో వున్న ఫ్లై ఓవర్ స్లాబ్ కూలిన ఘటనలో గాయపడ్డ కార్మికులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. 

హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్డు కూడలిలో చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తుండగా.. బుధవారం అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది కార్మికులకు గాయాలు కాగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన కార్మికులంతా బీహార్‌కు చెందినవారే. వెంటనే స్పందించిన సిబ్బంది, అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు.. ప్రమాద విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు.. సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మేయర్. అనంతరం ప్రమాదంలో గాయపడిన బాధిత కూలీలను కిమ్స్ హాస్పిటల్ పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.