మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ చెరుకూరి రామోజీ రావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్ను ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.
మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ చెరుకూరి రామోజీ రావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్ను ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఈ విచారణ సాగుతుంది. సోమవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శైలజ ఇంటికి చేరుకున్న సీఐడీ అధికారుల బృందం.. రామోజీరావు, శైలజను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ అధికారులు.. ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజ కిరణ్లను పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే పలువురు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచీల మేనేజర్లపై కూడా కేసులు నమోదు చేశారు.
మార్గదర్శిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల కేసులో ఏపీ సీఐడీ అధికారులు గత వారం సెక్షన్ 160 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం రామోజీరావు, శైలజ కిరణ్లకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మోసం చేయడం, డిపాజిట్లను మ్యూచువల్ ఫండ్స్లోకి మళ్లించడం, క్యాపిటల్ మార్కెట్ల నష్టాలు, చిట్ ఫండ్ బిజినెస్ యాక్ట్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై నోటీసులు జారీచేశారు.విచారణకు సహకరించేందుకు మార్చి 29 లేదా 31 లేదా ఏప్రిల్ 3 లేదా 6 తేదీల్లో వారి నివాసం లేదా కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సీఐడీ కోరింది.
ఇక, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలు, మేనేజర్ల ఇళ్లపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సోదాలు చేసింది.ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1999, చిట్ ఫండ్ యాక్ట్ 1982లను ఉల్లంఘించిన ఆరోపణలపై మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మార్చి 12న ఆంధ్రప్రదేశ్లోని మార్గదర్శి శాఖలపై దాడులు నిర్వహించిన అధికారులు నలుగురిని అరెస్టు చేశారు.
