ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధ అన్నారు. అయితే తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయబోనని, స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగుతానని ఆమె స్పష్టం చేశారు. 

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధ స్పష్టతనిచ్చారు. తాను ఇల్లెందు నుంచి పోటీ చేసే విషయం వాస్తవమే అని చెప్పారు. కానీ తాను ఏ పార్టీ టిక్కెట్ పై పోటీ చేయబోనని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని తెలిపారు. ప్రస్తుతం ఉస్మానియా పీజీ లా కాలేజీలో అసిస్టెంబ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ అనురాధ బుధవారం మీడియాతో మాట్లాడారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని ప్రచారం జరిగిందని చెప్పారు. అయితే తనను ఆ పార్టీ నేతలు సంప్రదించారని, ఇది వాస్తవమే అని తెలిపారు. తనకు తానుగా ఏ పార్టీతోనూ సమావేశం కాలేదని అన్నారు.

అయితే నియోజకవర్గంలో ఇటీవల మారిన రాజకీయ పరిస్థితులను చూసేందుకే తాను పర్యటించానని అనురాధ తెలిపారు. ఈ సమయంలో ప్రజలు, విద్యార్థి సంఘాలు, ఇతర ప్రజా సంఘాల, విప్లవ పార్టీల నాయకులు రాజకీయాల్లోకి రావాలని కోరారని చెప్పారు. అయితే స్వచ్చమైన, స్వేచ్ఛా పాలిటిక్స్ లక్ష్యంగా చేసుకోవాలని సూచించారని అన్నారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాని అన్నారు.

కాగా.. గుమ్మడి నర్సయ్య పోటీ చేస్తే మీరూ పోటీ చేస్తారా అని మీడియా అనురాధను ప్రశ్నించింది. దీనికి ఆమె సమాధానం చెబుతూ.. తమలో ఎవరో ఒకరు పోటీ చేస్తారని అన్నారు. తమ మధ్య పోటీ ఉండబోదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే నిర్ణయాన్ని తండ్రి స్వాగతించారని ఆమె స్పష్టం చేశారు.