లోన్యాప్ కేసు: పుణేలో రాచకొండ పోలీసుల వేట, ముగ్గురు అరెస్ట్
ఆన్లైన్ లోన్ యాప్లపై తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే యాప్ నిర్వాహకులను వేటాడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్లోకి రాచకొండ పోలీసులు చేరారు.
ఆన్లైన్ లోన్ యాప్లపై తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే యాప్ నిర్వాహకులను వేటాడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్లోకి రాచకొండ పోలీసులు చేరారు.
అధిక వడ్డీలతో వేధింపులకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పుణెలో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరించారు.
ప్రధాన నిందితుడు పరశురామ్తోపాటు భార్య లియాంగ్ టియాన్, పరుశురామ్ అనుచరుడు షేక్ ఆకిబ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 50 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
పుణే కేంద్రంగా ఈ కార్యకలాపాలు నిర్వహించినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి 101 ల్యాప్టాప్లు, 106 సెల్ఫోన్లు, సీసీ టీవీలు, డీవీఆర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు భగవత్ వెల్లడించారు.
లోన్ యాప్ కంపెనీ బ్యాంకు ఖాతాలకు చెందిన రూ.1.42 కోట్ల లావాదేవీలు నిలిపివేశామని సీపీ చెప్పారు. దాదాపు 14 ఇతర నకిలీ లోన్ యాప్లను గుర్తించినట్లు మహేశ్ భగవత్ పేర్కొన్నారు.
బబల్ లోన్, రూపీ బజార్, ఓకే క్యాష్, రూపీ ఫాక్టరీ, పైసా లోన్, వన్ హోప్, క్యాష్ బీ, ఇన్ నీడ్, స్నాప్ లోన్, పిక్కి బ్యాంక్, క్రేజీ రూపీ, రియల్ రూపీ, రూపీ బియర్, రూపీ మోస్ట్లను గుర్తించినట్లు కమీషనర్ వెల్లడించారు.
లోన్ యాప్ల వ్యవహారంలో ఇప్పటి వరకు 24 మంది అరెస్టయ్యారని ఆయన చెప్పారు. నిందితులు లోన్లు తీసుకున్న వారికి కాల్ సెంటర్ల ద్వారా ఫోన్లు చేయించి వేధిస్తున్నట్లు మహేశ్ భగవత్ వివరించారు.