హైదరాబాద్ (hyderabad) కేపీహెచ్బీ ఫేజ్ 4లో (kphb phase 4) విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతిచెందారు. నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో పడి బాలికలు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది
హైదరాబాద్ (hyderabad) కేపీహెచ్బీ ఫేజ్ 4లో (kphb phase 4) విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతిచెందారు. నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో పడి బాలికలు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మృతులను సంగీత, రమ్య, సోఫియాగా గుర్తించారు. మృతి చెందిన చిన్నారులంతా 12 ఏళ్ల లోపు వారే. ఇప్పటి వరకు ఇద్దరు బాలికల మృతదేహాలను వెలికితీశారు. మరో బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ .. నిర్మాణం కోసం గుంతలు తవ్వినట్లుగా తెలుస్తోంది. సెల్లార్ కోసం గుంత తవ్విన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతపై ఎలాంటి పైకప్పు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు, మృతుల తల్లిదండ్రులు ఆక్రోషిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే తమకు న్యాయం చేసేవరకు మృతదేహాలను ఆసుపత్రికి తరలించడానికి అంగీకరించేది లేదని స్థానికులు మండిపడుతున్నారు. అంతటితో ఆగకుండా కూకట్పల్లి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అంబులెన్స్ను స్థానికులు అడ్డుపడటంతో లాఠీఛార్జీ చేసి పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
