టెలికం రంగంలో సంచలనాలు స్రుష్టించిన రిలయన్స్ జియోను ఢీ కొట్టేందుకు గల ప్రతి అవకాశాన్ని దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది.


న్యూఢిల్లీ: టెలికం రంగంలో సంచలనాలు స్రుష్టించిన రిలయన్స్ జియోను ఢీ కొట్టేందుకు గల ప్రతి అవకాశాన్ని దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం పండుగల సీజన్‌లో తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు ప్రకటించింది. #AirtelThanks అని కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపిన ఎయిర్‌టెల్‌​.. లోయల్‌ కస్టమర్లకు రివార్డులను ఇవ్వనున్నట్టు పేర్కొంది.

నెలకు రూ.100 లేదా అంతకంటే ఎక్కువ ఆర్పూ నమోదయ్యే ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అదనపు ప్రయోజనాలను ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ ప్రయోజనాల్లో ప్రీమియం డిజిటల్‌ కంటెంట్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఓచర్లు ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్‌టెల్‌ ఇన్‌ఫినిటీ పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లకు అదనంగా రూ.1500 విలువైన మూడు నెలల నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను లభించనుంది. #AirtelThanks ప్రొగ్రామ్‌ను వీ-ఫైబర్‌ హోమ్‌ బ్రాండ్‌బ్యాండ్‌ కస్టమర్లకు కూడా ఎయిర్‌టెల్‌ విస్తరించబోతుంది. 

మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న ఎయిర్‌టెల్‌.. బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో అన్ని ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్మార్ట్‌ఫోన్లపై 100జీబీ బోనస్‌ డేటాతో పాటు రూ.4500 వరకు విలువైన ప్రయోజనాలను అందించనున్నట్టు ప్రకటించింది. ఇందులో రూ.2500 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ అందజేస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను డిజిటల్‌ ఓచర్ల రూపంలో ఆఫర్‌ చేస్తోంది. అంతేకాక ఎయిర్‌టెల్‌ తన ఇన్‌ఫినిటీ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు రూ.499, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రూ.1500 విలువైన మూడు నెలల నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ గిఫ్ట్‌ ఓచర్‌ను కూడా ఎలాంటి అదనపు ఛార్జ్‌ లేకుండా అందిస్తోంది.

ఈ సబ్‌స్క్రిప్షన్‌ గిఫ్ట్‌ ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌, మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌ కస్టమర్లకు జీ5 కంటెంట్‌ కూడా ఉచితంగా లభించనుంది. ప్రస్తుతం పండుగల సీజన్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ అమలు చేస్తున్న ‘బిగ్ బిలియన్ డే సేల్స్’ చివరి రోజు వరకూ ఈ ఆఫర్ అమలులో ఉంటుందని తెలిపింది.