Asianet News TeluguAsianet News Telugu

జియో యూసర్లకు షాక్: డేటా టారిఫ్ ప్లాన్ ఛార్జీలు పెంపు....

టెలికం వినియోగదారులపై భారం మోపేందుకు రంగం సిద్ధమవుతున్నది. దీనిపై ట్రాయ్ కన్సల్టేషన్ ప్రారంభించింది. తదనుగుణంగా స్పందించిన రిలయన్స్ జియో.. ఒక డేటా జీబీపై చార్జీని రూ.15 నుంచి రూ.20కి పెంచాలని.. విడుతల వారీగా పెంచేందుకు అనుమతించాలని కోరింది. 
 

jio seeks data pruice hike to rs 20 per gb from current rs 15 over 6 months
Author
Hyderabad, First Published Mar 7, 2020, 10:15 AM IST

న్యూఢిల్లీ: టెలికం రంగంలోకి అడుగుపెట్టి ఉచిత వాయిస్ కాల్స్‌తో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. గతేడాది చివర్లో ఉచితాన్ని ఎత్తివేసి షాకిచ్చింది. ఇప్పుడు అంతకుమించిన షాకిచ్చేందుకు సిద్ధమైంది.

వైర్‌లెస్ డేటా టారిఫ్‌లను పెంచాలని నిర్ణయించింది. టెలికాం రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చిన రిలయన్స్‌ జియో ఇప్పటి వరకు ఒక జీబీ డేటాకు ఉన్న రూ.15 మొత్తాన్ని రూ.20కి పెంచేందుకు అనుమతి కోరుతూ ట్రాయ్‌కు లేఖ రాసింది. 

వాయిస్‌ కాల్స్‌ ధరలను మాత్రం యథాతథంగా కొనసాగించనున్నట్లు అందులో జియో పేర్కొంది. అంతేకాక పెంచిన డేటా ధరలను తక్షణమే కాకుండా ఆరు నుంచి తొమ్మిది నెలల్లో అమలు చేయాలని భావిస్తున్నట్లు ట్రాయ్‌కు రాసిన లేఖలో తెలిపింది.

also read పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్

పెరిగిన డేటా ధరలు అన్ని టారిఫ్‌లకు వర్తిస్తాయని జియో పేర్కొంది. అంతకుముందు టెలికం రంగంలోని టారిఫ్‌ సమస్యలపై స్పందించాల్సిందిగా టెలికాం ఆపరేటర్లను ట్రాయ్‌ కోరింది. దీనిపై జియో కన్సల్టేషన్‌ పత్రాన్ని సమర్పించింది. 

భారతీయ వినియోగదారులు సాధారణంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు పొందాలనుకుంటారని, కాబట్టి పెరిగిన చార్జీలను రెండుమూడు విడతల్లో అమలు చేసే వెసులుబాటు కల్పించాలని ట్రాయ్‌ను జియో కోరింది. ఒకసారి డేటా చార్జీలను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత అన్ని టారిఫ్‌లలోనూ, అన్ని సెగ్మెంట్లలోనూ అమలు చేస్తామని జియో తెలిపింది.

అంతకుముందు 2016లో సేవలను ప్రారంభించిన రిలయన్స్ జియో.. వినియోగదారులకు ఉచిత సేవలను 2019 వరకు కొనసాగిస్తూ వచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్‌పై గత ఏడాది చివరిలో నిమిషానికి ఆరు పైసలు చొప్పున విధించింది.

also read కలర్ డిస్ ప్లేతో రియల్ మీ కొత్త బ్యాండ్... క్రికెట్ మోడ్ కూడా....

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ పెంపు తరువాత రిలయన్స్ జియో తన  ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లను వెల్లడించింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు 39 శాతం వరకు పెరిగాయని తెలిపింది....

భారతదేశంలో  రిలయన్స్  జియో కస్టమర్ల కోసం డిసెంబర్ 6 నుంచి కొత్త ‘ఆల్ ఇన్ వన్’  ప్లాన్ లను అమల్లోకి తెచ్చింది. జియో కొత్త రిచార్జ్ ప్లాన్లు రూ.129 నుంచి రూ. 2,199 వరకు ప్లాన్ లను ప్రవేశపెట్టింది. 

అంతకుముందు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తద్వారా గత సంవత్సరం చివరిలో డిసెంబర్ నెలలో దేశంలోని టెలికామ్ కంపెనీలు ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా, రిలయన్స్ జియో ముగ్గురు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల సుంకాలను పెంచారు. గత మూడేళ్లలో తొలిసారిగా మూడు కంపెనీలు 14 నుంచి 33 శాతం వరకు రీచార్జీ ధరల పెంపును ప్రకటించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios