వరల్డ్ నెం.3 మా లాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడిన శరత్ కమల్...టోక్యో ఒలింపిక్స్‌లో ముగిసిన భారత టేబుల్ టెన్నిస్ టీం పోరాటం...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ పోరాటం ముగిసింది. మెన్స్ సింగిల్స్‌లో మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లిన శరత్ కమల్, వరల్డ్ నెం.3 మా లాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడి, టోర్నీ నుంచి నిష్కమించాడు.

వరల్డ్ నెం.1పై రెండో సెట్‌లో విజయం సాధించిన తర్వాత శరత్ కమల్, ఆ తర్వాత మా లాంగ్ దూకుడు ముందు నిలవలేకపోయాడు. తొలి సెట్‌ను 11-7 తేడాతో కోల్పోయిన శరత్ కమల్, రెండో సెట్‌లో 8-11 తేడాతో గెలుచుకున్నాడు.

మూడో సెట్‌లో 13-11, నాలుగో సెట్‌ను 11-4, చివరి సెట్‌లో 11-4 తేడాతో ఓడి మ్యాచ్‌ను కోల్పోయాడు. 39 ఏళ్ల శరత్ కమల్‌కి ఇది నాలుగో ఒలింపిక్ కాగా, మూడో రౌండ్‌కి చేరడం ఇదే తొలిసారి. 

ఇప్పటికే టేబుల్ టెన్నిస్‌ వుమెన్స్ సింగిల్స్‌లో సుత్రీత ఛటర్జీ రెండో రౌండ్‌లో, మానికా బత్రా మూడో రౌండ్‌లో ఓడగా, సాథియన్ జ్ఞానశేఖరన్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ టీం పోరాటం ముగిసింది.

ఒలింపిక్స్ చరిత్రలో ఎప్పుడూ మొదటి రౌండ్‌ దాటని భారత టీటీ బృందం, ఈసారి మూడో రౌండ్‌లోకి వెళ్లి మంచి పర్ఫామెన్స్ ఇచ్చినా మెడల్ సాధించలేకపోయారు.