ప్రో కబడ్డి 2019: విజృంభించిన రోహిత్... బెంగళూరు చేతిలో జైపూర్ చిత్తు
ప్రో కబడ్డి లీగ్ 2019 లో జైపూర్ పింక్ పాంథర్స్ మరో ఓటమిని చవిచూసింది. బెంగళూరు బుల్స్ తో జరిగిన మ్యాచ్ లో పాంథర్స్ ఓటమిపాలయ్యింది.
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో బెంగళూరు మరో విజయాన్ని అందుకుంది. డిల్లీలోని త్యాగరాయ స్పోర్ట్ కాంప్లెక్ లో ఇవాళ బెంగళూరు బుల్స్-జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు తలపడ్డాయి. గత మ్యాచ్ లో ఓటమిని చవిచూసిన ఇరు జట్లూ ఎలాగైనా గెలవాలన్న కసితో ఆడాయి. అయితే బెంగళూరు స్టార్ రైడర్ రోహిత్ కుమార్ 13 పాయిట్లతో చెలరేగి తమ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. దీంతో జైపూర్ 11 పాయింట్ల తేడాతో మరో ఓటమిని చవిచూసింది.
బెంగళూరు జట్టు రైడింగ్, ట్యాకిల్స్ లో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా స్టార్ రైడర్లు రోహిత్ కుమార్ 13, పవన్ కుమార్ 8 పాయింట్లతో చెలరేగి తమ జట్టుకు కేవలం రైడింగ్ లోనే ఏకంగా 21 పాయింట్లను అందించారు. ఇవి కాకుండా సూపర్ రైడ్ రూపంలో మరో పాయింట్ అదనంగా వచ్చింది. ఇక ట్యాకిల్స్ లో 14, ఆలౌట్ల ద్వారా 4 తో బెంగళూరు జట్టు మొత్తం 41 పాయింట్లు సాధించింది.
రోహిత్, పవన్ లు కాకుండా మిగతా ఆటగాళ్లలో మహేందర్ సింగ్ 6, మోహిత్ 5, సురభ్ 5 పాయింట్లతో రాణించారు. దీంతో బెంగళూరు ఘన విజయాన్ని అందుకుంది.
పింక్ పాంథర్స్ విషయానికి వస్తే రైడింగ్ లో 13, ట్యాకిల్స్ లో 12, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్ట్రాల రూపంలో 3 మొత్తం 30 పాయింట్లు సాధించింది. ఆటగాళ్లలో నితీశ్ 8, అజింక్యా 5 పాయింట్లతో ఆకట్టుకున్నా మిగతావారెవరూ ఈ స్థాయిలో రాణించలేరు. సుశీల్ 3, సందీప్ 2, దీపక్ 2, సునీల్ 2, సెల్వం 2 పాయింట్లు సాధించారు. అయినప్పటికి జైపూర్ కేవలం 11 పాయింట్లయ తేడాతో బెంగళూరు చేతిలో ఓటమిపాలయ్యింది.