IND vs SA : హైదరబాదీ పేసర్ సిరాజ్ రీఎంట్రీ... సౌతాఫ్రికాతో టీ20 సిరిస్ కు ఎంపిక
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టీ20 సీరిస్ లో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయంతో బాధపడుతూ మొదటి టీ20 ఆడలేకపోయిన స్టార్ బౌలర్ బుమ్రా తాజాగా సీరిస్ మొత్తానికి దూరమయ్యాడు.
ముంబై : భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సీరిస్ కు మరో కీలక ఆటగాడు దూరమయ్యాడు. గాయంతో బాధపడుతున్న టీమిండియా కీలక బౌలర్ జస్ప్రిత్ సింగ్ బుమ్రా ఈ సిరీస్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ను దక్షిణాప్రికాతో మిగతా టీ20 మ్యాచులు ఆడనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది.
దక్షిణాఫ్రికాతో టీ20 సీరిస్ కోసం బుమ్రా ఎంపికయినా వెన్నునొప్పితో బాధపడుతూ తిరువనంతపురంలో జరిగిన మొదటి టీ20 లో ఆడలేదు. అతడి స్థానంలో దీపక్ చాహర్ ను ఆడించారు. అయితే బుమ్రాకు గాయం తగ్గకపోవడంతో ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మిగతా రెండు టీ20 ల కోసం మరో బౌలర్ సిరాజ్ ను ఎంపికచేసారు టీమిండియా సెలెక్టర్లు.
ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్ళు స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సీరిస్ కు దూరమయ్యారు. వెన్నెముక గాయంతో దీపక్ హుడా జట్టుకు దూరమయ్యాడు. అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ కూడా ఈ టీ20 సీరిస్ ఆడటంలేదు. మహ్మద్ షమీ కూడా కరోనా నుండి పూర్తిగా కోలుకోకపోవడంతో భారత జట్టులో చోటు దక్కలేదు. ఇలా కీలక ఆటగాళ్లు మరీ ముఖ్యంగా టాప్ బౌలర్లు సౌతాఫ్రికా టీ20 సీరిస్ కు దూరమయ్యారు.
ప్రస్తుతం టీమిండియా బుమ్రా బౌలింగ్ పై బోలెడు ఆశలు పెట్టుకుంది. తిరువనంతపురం మ్యాచ్ లో ఆడకున్నా తర్వాత గౌహతి, ఇండోర్ వేదికగా జరిగే మిగతా రెండు మ్యాచుల్లో అతడు ఆడతాడని అందరూ భావించారు. అయితే ఈ ఆశలపై బిసిసిఐ ప్రకటన నీళ్ళు చల్లింది. బుమ్రాను ఈ సీరిస్ మొత్తానికి దూరంచేస్తూ సిరాజ్ ను ఎంపికచేసినట్లు ప్రకటించింది. ఇలా కీలక బౌలర్లంతా దక్షిణాఫ్రికాతో టీ20 సీరిస్ కు దూరమవడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.
టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాను గాయాలు సతమతం చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ఆడుతున్న చివరి టీ20 సీరిస్ ఇది. ఇలాంటి సమయంలో ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమవడం కలవరపెడుతోంది. ఇప్పటికే బౌలింగ్ లో తడబడుతున్న టీమిండియా బుమ్రా, భువనేశ్వర్, షమీ వంటి సీనియర్లు లేకుండానే సౌతాఫ్రికా సీరిస్ ఆడాల్సి వస్తోంది. టీ20 వరల్డ్ కప్ సమయంలోనూ పరిస్థితి ఇలాగే వుంటే ఎలాగని క్రికెట్ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.
అయితే బుమ్రా స్థానంలో సిరాజ్ ఎంపికవడం హైదరబాదీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పాలి. కానీ సిరాజ్ ను ఈ సీరిస్ కే పరిమితం చేస్తారా లేక టీ20 వరల్డ్ కప్ కూడా ఆడిస్తారా అన్నది సెలెక్టర్ల నిర్ణయం. కానీ వరల్డ్ కప్ కు సిరాజ్ ను ఎంపికచేయాలని హైదరాబాదీ క్రికెట్ ప్యాన్స్ కోరుకుంటున్నారు.