అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పోలీసు వాహనం ఢీకొని తెలుగు యువతి దుర్మరణం..
అమెరికాలోని సియాటెల్ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు వాహనం ఢీకొని తెలుగు యువతి మృతిచెందింది. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
అమెరికాలోని సియాటెల్ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు వాహనం ఢీకొని తెలుగు యువతి మృతిచెందింది. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. యువతిని జాహ్నవి కందులగా గుర్తించారు. వివరాలు.. జహ్నవి కందుల రాత్రి 8 గంటల సమయంలో డెక్స్టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెను పోలీసు వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జహ్నవి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకున్నారు. సియాటెల్ ఫైర్ డిపార్ట్మెంట్ మెడిక్స్ వచ్చేలోపు ఆమెకు ఘటన స్థలంలో సీపీఆర్ చేశారు.
వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకున్న అనంతరం వారు జహ్నవి ప్రాణాలను రక్షించే చర్యలను చేపట్టారు. తర్వాత ఆమెను హార్బర్వ్యూ మెడికల్ సెంటర్కు తరలించారు. అక్కడ జహ్నవి మరణించింది. సియాటెల్ పోలీసు డిపార్ట్మెంట్ ప్రకారం.. ఈ ప్రమాదానికి కారణమైన అధికారి 2019 నవంబర్ నుంచి డిపార్ట్మెంట్లో విధుల్లో ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు దర్యాప్తుల్లో ఉన్నాయని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ ప్రమాదానికి కారణమైన అధికారి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
ఇక, జహ్నవి కందుల పోలీసు వాహనం ఢీకొని తీవ్ర గాయాలు కావడంతోనే మరణించినట్టుగా స్థానిక అధికారులు ధ్రువీకరించారు. ఇక, జహ్నవిది కర్నూలు జిల్లా ఆదోనిగా సమాచారం.