డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్.. వివరాలు ఇవే..
కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు.

కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద నమోదైన పాత డ్రగ్స్ కేసుకు సంబంధించి సుఖ్పాల్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ మంజీత్ సింగ్, డీఎస్పీ ఏఆర్ శర్మ నేతృత్వంలో పంజాబ్ పోలీసులు.. గురువారం ఉదయం 6:30 గంటలకు చండీగఢ్లోని సుఖ్పాల్ సింగ్ ఇంటిపై దాడి చేసిన తర్వాత ఆయనను అరెస్టు చేశారు.
అయితే పోలీసులు తన ఇంటికి వచ్చిన విజువల్స్ను ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అందులో ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్.. తన ఇంటికి వచ్చిన పోలీసులతో వాదనకు దిగారు. పోలీసులను వారెంట్ అడిగడం చూడొచ్చు. ఈ క్రమంలోనే పోలీసులు.. పాత ఎన్డీపీఎస్ కేసులో డీఐజీ ర్యాంక్ అధికారి, ఇద్దరు ఎస్ఎస్పీల నేతృత్వంలోని సిట్ నిర్వహించిన దర్యాప్తు సిఫారసు మేరకు ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అయితే ఆ కేసును ఇప్పటికే సుప్రీం కోర్టు రద్దు చేసిందని ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ పేర్కొన్నారు. ఇక, ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ను అరెస్ట్ చేసి జలాలాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నట్లు పోలీసులు ఆయన కుమారుడు మెహతాబ్ ఖైరాకు చెప్పడం కూడా వీడియో చూడొచ్చు.
అయితే ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా అరెస్ట్ను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఖండించారు. ఈ అరెస్ట్కు సంబంధించి పంజాబ్లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఇది రాజకీయ ప్రతీకార చర్య అని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలను బెదిరించడం, ప్రధాన సమస్యల నుండి దృష్టి మరల్చడానికి ఆప్ ప్రభుత్వం ఎత్తుగడగా దీనిని ఆయన పేర్కొన్నారు. తాము ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరాకు మద్దతుగా ఉంటామని చెప్పారు.
ఈ కేసును పరిశీలిస్తే.. 2015 మార్చిలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణ కొనసాగుతుండగా.. రెండు కిలోల హెరాయిన్, 24 బంగారు బిస్కెట్లు, ఒక దేశీయ పిస్టల్, రెండు పాకిస్థానీ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు 2017లో తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించారు. ఆ తర్వాత అదనపు నిందితుడిగా సుఖ్పాల్ సింగ్ ఖైరా పేరు విచారణలో బయటపడింది. 2021లో అదే ఎఫ్ఐఆర్తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుఖ్పాల్ సింగ్ను అరెస్టు చేసింది. ఈరోజు అరెస్టు చేశారు. అయితే 2022లో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇక, 2023 ఫిబ్రవరి 16 డ్రగ్స్ కేసులో సుఖ్పాల్ సింగ్ ఖైరాపై సమన్ల ఉత్తర్వులను న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.