Asianet News TeluguAsianet News Telugu

వసంతా లక్ష్మణ్ కవిత : అంతర్మథనం

అంతర్మధనంలో రగులుతున్న నిశ్శబ్ద సందేశం ఆకు పచ్చని పదాల పూతలై  కవితగా నిలబడేందుకు చేసిన "అంతర్మధనం" నిజామాబాద్ నుండి రాస్తున్న శ్రీమతి వసంతా లక్ష్మణ్ కవితలో చదవండి.

Vasantha Laxman Telugu poem, Telugu literature
Author
Hyderabad, First Published Dec 8, 2021, 1:18 PM IST

ఇన్నాళ్లు చెప్పుకోడానికి
నన్ను నేను విప్పుకోడానికి 
ఏమీ లేక 
నాలో నేనై మిగిలాను
ఒక నిర్వేదపు నిశ్శబ్దం 
నన్ను పగులగొడ్తుంటే
రాగాన్ని దాచుకున్న కోయిలలా 
మౌనమై ముడుచుకున్నాను
స్తబ్ధంగా ప్రవహిస్తున్న
నా ఏకాంత నదిలో 
కలలు లేవు 
అలల పలకరింపులు అసలే లేవు
శూన్య పక్షినై
శరీరంతో సహవాసం చేసిన 
అనారోగ్యపు సందోహాలను విదిలించుకొని
ఇప్పుడిపుడే తేటపడ్తు 
కాసిన్ని అనుభూతుల్ని 
కలం నిండా నింపుకొని
మిమ్మల్నిలా పలకరించే
సాహసం చేస్తున్నాను
అయినా కవిత్వంలో ఏముంటుంది 
నాలుగు పదాల కూర్పే కదా అనుకోవద్దు
ఒక్కసారి మనసు పెట్టి 
చదివి చూడు
నా కవిత్వంలోని అక్షరమక్షరం నడుమ 
నా మనసు పడే ఆర్ద్రత ఉంటుంది
ఇన్నాళ్లు నా అంతర్మధనంలో రగులుతున్న 
ఒక నిశ్శబ్ద సందేశం ఉంటుంది
పుస్తకంలోని చివరి పేజీలా
ఖాళీలా  నిలబడ్డ నన్ను
మీ ఆత్మీయత పలకరించిందేమో
నెర్రెలు విచ్చిన మనసుపై
ఆకుపచ్చని పదాల పూలతలు 
మొలకెత్తి ఇవాళ్ళ మీ ఎదుట 
నన్నొక కవితగా నిలబెట్టాయి.

Follow Us:
Download App:
  • android
  • ios