‘మంచి కవిత్వం సంఘర్షణలో నుంచే జనిస్తుంది’
డాక్టర్ బండారి సుజాత పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం హన్మకొండలో పలువురు ప్రముఖ కవులు, రచయితలు, విమర్శకుల సమక్షంలో జరిగింది. ఆమె కవితా సంపుటి వేకువ పుష్పం, కథా సంపుటి వెలుతురు చూడని యెన్నియలు ఆవిష్కరించారు.
![telugu poet dr bandari sujatha books launched in hanmakonda kms telugu poet dr bandari sujatha books launched in hanmakonda kms](https://static-ai.asianetnews.com/images/01hsk3m4xdsq90h0q9fjt8cmyw/whatsapp-image-2024-03-22-at-5-14-24-pm-jpeg_363x203xt.jpg)
డా. బండారి సుజాత పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నిన్న హన్మకొండలో జరిగింది. ఆమె కవితా సంపుటి వేకువ పుష్పం, కథా సంపుటి వెలుతురు చూడని యెన్నియలు ఆవిష్కరించారు. శ్రీలేఖ సాహితి సమితి అధ్యక్షులు డాక్టర్ టీ శ్రీరంగస్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ విమర్శకురాలు, రచయిత్రి కాత్యాయని విద్మహే పుస్తకాలని ఆవిష్కరించి మాట్లాడారు. కవిత్వంలో సాంద్రత, వ్యక్తీకరణతోపాటు సాధారణ వాక్యానికి భిన్నంగా కవిత్వం ఉండాలని, లోతైన భావాలతో కవి నిరంతరం సంఘర్షణకు గురైనప్పుడే మంచి కవిత్వం వస్తుందని అన్నారు. డా. బండారి సుజాత రచనలలో సామాజిక అంశాలు ఎక్కువగా చోటుచేసుకోవడం విశేషణమని పేర్కొన్నారు.
కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్ పుస్తకాన్ని సమీక్షిస్తూ సుజాత ఉపాధ్యాయురాలుగా, పరిశోధకురాలుగా, కవిగా, రచయితగా కొనసాగుతూనే పలు ప్రజాస్వామిక సంస్థలతో కలిసి విలువల కోసం నిరంతరం కృషిని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. తన రచనలలో మహిళలపై జరుగుతున్న వివక్షతలను ప్రశ్నించడంతోపాటు మగవాడి దౌర్ఙన్యాలనుండి స్త్రీ విముక్తి పొందేవిధంగా ధైర్యంగా అడుగులు ముందుపడాలని సూచిస్తారు. మరో సమీక్షకురాలు సింగరాజు రమాదేవి మాట్లాడుతూ సుజాత కథలు మానవీయకోణంలో కొనసాగాయని అన్నారు. కార్యక్రమంలో అతిథులుగా అన్నవరం దేవేందర్, రాపోలు సత్యనారాయణ, అనిశెట్టి రజిత, పొట్లపల్లి శ్రీనివాసరావు, రాపోలు సత్యనారాయణ పాల్గొని మాట్లారు. కవులు పి.చందు, నాగిళ్ళ రామశాస్త్రి, పల్లె నాగేశ్వరావు, కోడం కుమారస్వామి, మంథిని శంకర్, కార్తీకరాజు, గట్టు రాధిక, బాలబోయిన రమాదేవి, ఉదయశ్రీ ప్రభాకర్, వల్సపైడి, వందన, లీల, విద్యాదేవి, సోమన్న, సంపత్ రెడ్డి, ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.