నిమ్న జాతి పాకల్లోని చిమ్నీ దీపాలకు చైతన్యపు చమురు పోసినాడు అంటూ నల్లగొండ నుండి డాక్టర్ మండల స్వామి రాసిన కవిత  ' నిత్యప్రవాహం ' ఇక్కడ చదవండి : 

అస్పృశ్యతా శూలాలెన్నో
భరించిన బాల్యం
అక్షర సముద్రాలను
ఎదురీదిన స్వానుభవం

ఆ పేరు ప్రతిధ్వనించినపుడు 
గ్రంధాలయాలెన్నో 
గర్వంతో తలెత్తుకుంటవి
పుస్తకాల పుటలన్నీ
పఠన జెండాలై
రెపరెపలాడుతుంటవి

నిమ్న జాతి పాకల్లోని
చిమ్నీ దీపాలకు 
చైతన్యపు చమురు పోసినాడు

అసమానతా
అంచెల అంచుల్లో
సమతా గళం
బలంగా వినిపించాడు

మూఢత్వపు ముంగిళ్లకు
మేలిమి ఫలాలు పంచినాడు

రాజ్యాంగం రాసిచ్చిన
విద్యామూర్తిమత్వంతో
ప్రపంచ ప్రశంసలందుకున్న
భారత దేశ మేధో ప్రతినిధి

జ్ఞానకిరణాలు
విరగబూయించిన
ఆతని తాత్వికతకు
విశ్వ విజ్ఞాన కేంద్రాలు
ప్రణమిల్లిన మజిలీలెన్నో

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
శిఖర చరితార్థుడు
ఆయన రూపం.....!!
నిండైన నిగ్రహ విగ్రహం
కోటానుకోట్ల చూపులకు
సరి కొత్త పాఠం
నిరంతరంగా.........
నిత్య ప్రవాహంలా.........