కవి విశ్వభద్ర రాసిన కవిత ‘ప్రవాసం ముగిసింది’ ఇక్కడ చదవండి..

ఏ గాన గంధర్వుడో 
ఏ మోహన స్వర స్వరూపుడో
విధి వశాత్తో
అణగారిన వర్గాల అదృష్ట వశాత్తో
పుట్టిన నేల తెలంగాణ

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నారద తుంబురులు పెక్కురున్నా 
నవరస స్వరరాగ రంజితులైనా
ఒక ప్రత్యేక గళముద్రా గభీరతాగతి
దివినుండి భువికి దిగి వచ్చిన సుస్వర అమందానంద భాగీరథి

అల్లాడుతున్న నేలమ్మ గొంతుకను తన శ్రుతితో 
స్వరకరవాలంగా మలచుకున్నాడు
ఎగసి పడుతున్న ఎర్రని ఆక్రోశాలకు వాయులీనమై 
రాగాభిషేకం చేశాడు
సుస్వర మోహితులైన సబ్బండ వర్ణాలకు
గజ్జెకట్టి బ్రతుకు పాట నేర్పాడు

బ్యాలెట్ ను బందూకుతో జయించిన మావో యిష్టుడైనా
బందూకును బ్యాలెట్ తో పేల్చే అంబేద్కర్ వారసుడైనాడు
బుద్ధునికి రామానుజునికే కాదు
అణగారిన వర్గాల ఆప్తులందరికీ ఆదుకునే రాగాల్ని పంచాడు

పరిణతి చెందని ప్రజాస్వామ్యంలో ఓటు విలువకు సలాం కొట్టాడు
వెన్నులో గరళం లాంటి బుల్లెట్ తో చేసిన
పాతిక సంవత్సరాల సహజీవనం
ఖద్దరు రాజకీయాలకు నిషానిగానే మిగిలింది

చద్దరు విందు రాజకీయాలకు లొంగని సాంస్కృతిక స్వచ్ఛ మూర్తి
మాట పాట ఆట
ఆశయ స్వరాల ఊట
చిత్తజల్లులా అందరి అక్కున చేరింది

అతడు మాత్రం పాడుకుంటేనే
పాటను మనకు ధారాదత్తం చేసి 
ప్రవాసం ముగిసిందని వెళ్లి పోయాడు

.. కవి విశ్వభద్ర
సెల్ : 8125365236