సారాంశం

ప్రముఖ రచయిత జాలాది రత్నసుధీర్‌ రచించిన కథల సంపుటి - మనసు పలికిన - ఆవిష్కరణ సభ  ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది

ప్రముఖ రచయిత జాలాది రత్నసుధీర్‌ రచించిన కథల సంపుటి - మనసు పలికిన - ఆవిష్కరణ సభ  ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది. ఆ కార్యక్రమం వివరాలు ఇక్కడ చదవండి : 

ప్రముఖ రచయిత జాలాది రత్నసుధీర్‌ రచించిన కథల సంపుటి - మనసు పలికిన - ఆవిష్కరణ సభ  ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది.  సభకు ప్రముఖ రచయిత సి.ఎస్‌. రాంబాబు అధ్యక్షత వహిస్తారు.  పుస్తకాన్ని ఆచార్య కొలుకలూరి ఇనాక్‌ ఆవిష్కరిస్తారు. సభలో ఇంకా విహారి, ఎ. దినకరబాబు, గుడిపాటి ప్రసంగిస్తారు. 

మధ్యతరగతి కుటుంబాలలోని వైరుధ్యాను చిత్రించడంలో శ్రద్ధ చూపుతారు రత్నసుధీర్‌.  మనసును కేంద్రంగా చేసుకొని రాసిన 15 కథల సమాహారం ఈ పుస్తకం.  మనిషి మనసు ఒక్కతీరున స్థిరంగా ఉంచదు. కనుక మనుషులు ఎపుడూ ఒకేతీరున ఉండరు. ఒక దశలో తాము నమ్మిన విశ్వాసాలకు అనువుగా వ్యవహరించిన వారే, మరో దశలో వాటికి భిన్నంగా నడుచుకుంటారు. మనిషి మనసు కూడా అంతే. భిన్న కాలాలలో భిన్న రీతులుగా మారిపోతుంటుంది. మనసు చెప్పిన మాట వినడం చాలామందికి తెలియదు. మనసు కూడా స్థిరంగా ఉండదు. వీటన్నిటిని గ్రహించి మనుషుల పోకడలని తన కథలలో చిత్రించారు రత్న సుధీర్‌. 

మానవ సంబంధాలను, మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలను, పిల్లల పెంపకంలో మనస్తత్వ పరిశీలన ప్రాముఖ్యతను ఈ కథలు వివరిస్తాయి. రత్నసుధీర్‌ ఇదివరలో  ‘మనసు కథలు’  పేరుతో ఒక సంపుటి వెలువరించారు. మనసును కేంద్రంగా చేసుకొని రాసిన రెండో కథల సంపుటి ఇది. మనిషి మనసు ఎంత చిత్రమైనదో, ఎన్ని హోయలు పోతున్నదో కథల ద్వారా చెప్పడం విశేషం. ‘గుప్పెడుమనసు’ ఎన్నిరకాలుగా భావోద్వేగాలకు లోను చేస్తుందో చెప్పిన తీరు ఆసక్తికరం. 

కథకునిగా ప్రసిద్ధి చెందిన జాలాది రత్న సుధీర్‌ కవి, గేయకర్త, నాటకకర్త, వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయిత. కవిత్వం రాశారు. కొన్ని సినిమాలకు పాటలు రాశారు. యూట్యూబ్‌ చానల్‌ ద్వారా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వారి ప్రసంగాలు యువతకు స్ఫూర్తిదాయకం. కథా రచయితగా సమాజ గమనాన్ని, మనుషుల్లోని వైరుధ్యాలను చిత్రించారు. 
ఫిక్షన్‌తో పాటు నాన్‌ ఫిక్షన్‌ పుస్తకాలు వెలువరించారు. ఈ క్రమాన  ముఖ్యంగా అమ్మను కేంద్రంగా చేసుకొని ‘అమ్మ చెక్కిన శిల్పం’ పేరుతో ఒక వ్యాసాల పుస్తకం తీసుకొచ్చారు. ఇది వారి నుంచి వెలువడిన విలక్షణమైన వాచకం. విభిన్న రంగాలలో ప్రసిద్ధి చెందిన వారి జీవితంలో వారి మాతృమూర్తులు పోషించిన పాత్రని ఒక్కొక్క వ్యాసంలో వివరించారు. భిన్న రంగాలకు చెందిన 26 మంది ప్రముఖుల జీవితంలో వారి తల్లుల పాత్రని చెప్పడం ఈ పుస్తకం ప్రత్యేకత.  

ఇప్పటివరకు రత్న సుధీర్‌ వెలువరించిన పుస్తకాలు : 

1. మనసు కథలు 
2. మనసు పలికిన... 
3. అమ్మ చెక్కిన శిల్పం
4. గెలవాలంటే... (విజయవానికి ఏడు సూత్రాలు)
5. ప్రక్షాళన (కవిత్వం) 
6. స్పర్శ (కవిత్వం)  

తెలుగులోనే కాదు ఇంగ్లీషులోనూ రాయగలిగిన ప్రతిభావంతులు రత్నసుధీర్‌. అమ్మ చెక్కిన శిల్పం, గెలవాలంటే పుస్తకాలను తనే ఆంగ్లంలోకి అనువదించి, పుస్తకాలుగా వెలువరించారు. రెండు భాషల్లోనూ మంచి పట్టు ఉన్న సృజనశీలి రత్నసుధీర్‌. నిత్యమూ, నిరంతరమూ సృజనాత్మకంగా గడిపే జాలాది రత్న సుధీర్‌ కథల సంపుటి - మనసు పలికిన - ఆవిష్కరణ సభకు ఇదే ఆహ్వానం.