Asianet News TeluguAsianet News Telugu

ఘనపురం దేవేందర్ కవిత : ప్రజలు గెలవాలి

ఓట్లను నోట్లు కమ్మేసి మత్తులో ముంచేసే కాలంలో  'ప్రజలు గెలవాలి ' అంటూ నిజామాబాద్ నుండి ఘణపురం దేవేందర్ రాసిన కవిత ఇక్కడ చదవండి : 

Ghanpuram Devender poem - bsb - opk
Author
First Published Nov 27, 2023, 12:51 PM IST

ఓట్ల సమయం వచ్చింది
వాగ్దానాల గేట్లు తెరుచుకున్నాయి
అబద్ధాలు అందంగా చెక్కబడి 
ప్రదర్శనలో పెట్టబడ్డాయి
ఓటర్ లోని ఆశను ఆకర్షించేందుకు
ఉచిత అయస్కాంతాలు కసరత్తు చేస్తున్నాయి
ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు
ఉద్వేగాల వలలు పరుచబడ్డాయి
ఎన్నికలంటే ఒకరి క్షేమం కాదు
జాతి క్షేమం

ఇప్పుడు
మచ్చలేని నాయకులు మచ్చుకైనా దొరకరు
తరతరాల కోసం ఆస్తులు సంపాదించుకునేవాళ్లు తప్ప
ముందుతరం కోసం పనిచేసే నాయకులు అరుదైన కాలం
ఆత్మాభిమానాలు ఆత్మహత్య చేసుకునే కాలం
ఆత్మవిశ్వాసాల అడ్రస్ గల్లంతయై
పౌరుషాల కోరలు పీకేసే కాలం
విద్వేష వ్యూహాలకు పదును పెట్టి
నది లాంటి భాషను వదిలి
మురికి కాలువ లాంటి
తిట్లజలంలో జలకాలాడే కాలం
ఓట్లను నోట్లు కమ్మేసి మత్తులో ముంచేసే కాలం
ఓటర్లను ఒకవైపు నుంచి మతం 
మరో వైపు  కులం కుళ్ళబొడిచే కాలం

ఓట్లను అనుచిత ఉచితాలు కొల్లగొట్టే కాలం
ఓట్లను సర్వేలు మాయ చేసే కాలం
ఓటరు సింహాన్ని
చైతన్యం ముసుగు కప్పుకున్న
సోషల్ మీడియా నక్కలు వంచించే కాలం
అకారణ శత్రువులు బుసలు కొట్టేందుకు అనువైన కాలం
ఏమరిస్తే అస్తిత్వ పడవకు చిల్లులు పడే కాలం

ఓటు బ్రహ్మాస్త్రం సంధించేవాడు 
లోక కళ్యాణం కోరాలి
పయోముఖ విష కుంభాల ముందు
అర్జునుడి కన్నా ఒక ఆకు ఎక్కువ చదువుకుని విజృంభించాలి
చివరికి ప్రజలు గెలవాలి
ప్రగతి పతాక ఎగరాలి
ప్రజాస్వామ్యం మురవాలి

Follow Us:
Download App:
  • android
  • ios