Asianet News TeluguAsianet News Telugu

కవి నమిలికొండ బాలకిషనరావు ఇక లేరు

ప్రముఖ కవి, న్యాయవాది, ప్రసారిక పత్రిక సంపాదకులు, ఓరుగల్లు సాహితీ ముద్దుబిడ్డ, నమిలికొండ బాలకిషన్ రావు (72) అనారోగ్యంతో హనుమకొండలో ఈరోజు [30-3-2023] మధ్యాహ్నం అంతిమ శ్వాస విడిచారు. 
 

famous writer namilikonda balakishan rao passed away ksp
Author
First Published Mar 30, 2023, 6:00 PM IST

ప్రముఖ కవి, న్యాయవాది, ప్రసారిక పత్రిక సంపాదకులు, ఓరుగల్లు సాహితీ ముద్దుబిడ్డ, నమిలికొండ బాలకిషన్ రావు (72) అనారోగ్యంతో హనుమకొండలో ఈరోజు [30-3-2023] మధ్యాహ్నం అంతిమ శ్వాస విడిచారు. 

సెప్టెంబరు 6,  1950న నాటి కరీంనగర్ జిల్లా పూడూరులో నమిలికొండ నారాయణరావు రత్నబాయి దంపతులకు నమలికొండ బాలకిషన్ రావు జన్మించారు.  ఎం.ఏ, ఎల్.ఎల్.బి, పట్టభద్రుడైన బాలకిషన్ హనుమకొండలో న్యాయవాద వృత్తి చేపట్టారు. వర్ధమాన రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1982లో ప్రసారిక అనే మాసపత్రికను స్థాపించారు.
 
నమలికొండ బాలకిషన్ ప్రసారిక పత్రికతో పాటు తన స్వీయ రచనలైన యువస్వరం (1981) అక్షర చిత్రాలు (1986) శాంతి సమత (1989) అక్షరాల్లో అనంతం (1990) అక్షర ప్రతిబింబం (2006) ప్రసారకీయ కుసుమాలు(2010), మొదలైనవి వెలువరించారు. షష్టిపూర్తి సందర్భంగా శ్రీరంగస్వామి సంపాదకత్వంలో  "బాల గోకులం అక్షర వసంతం" అనే ప్రత్యేక సంచిక వెలువడింది.  ఓరుగల్లు సాహితీ శిఖరంగా వెలుగొందిన నమలికొండ మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు.
         
హనుమకొండలో నమలికొండ సాహితీపరులకు కొండంత అండదండగా ఉండేవారు. చైతన్య సాహితి, సాంస్కృతిక సమాఖ్య, సాహితీ సమితి, పోతన విజ్ఞాన పీఠం, కాళోజీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులుగా, రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం క్రియాశీల సభ్యుడిగా విశేష సేవలు అందించిన ఆయన గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు.

ప్రసారిక మాసపత్రిక ద్వారా నూతన తరానికి వేదిక కల్పించారు. సాహితీ సమితి వేదిక ద్వారా నమలికొండ అధ్యక్షులుగా  పొట్లపల్లి శ్రీనివాసరావు కార్యదర్శిగా మరికొందరు కలిసి అనేక సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలునిర్వహించి  పుస్తక ప్రచురణలు కావించారు.
 
ప్రముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా  చాలామంది కవులకు సాహితీ సమితి ఒక వేదికగా నిలిచింది. ఇందుకు బాలకిషన్ రావు  కృషి, ప్రోత్సాహము , ప్రేరణ, వితరణ మాటలతో చెప్పలేనిది. దేవులపల్లి రామానుజ రావు, చేతన వార్త కవులు, కాళోజి సోదరులతో ప్రత్యక్ష పరిచయం, విడదీయరాని అనుబంధం నమలికొండ గారిది.  సాహితీ సభలకు నభారా ఒక ఎస్సెట్ గా ఉండేవాడు. అక్షర చిత్రాలు, శాంతి సమత లాంటి అనేక కవితా సంపుటాలు ప్రచురించిన నమిలికొండ ఇక లేరు అన్న వార్త జీర్ణించుకోవడం తెలుగు సాహిత్య లోకానికి కష్టంగా ఉంది.   నమిలికొండ ఆత్మకు శాంతి చేకూరాలని వారి
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి విపత్కర పరిస్థితి నుండి వారు త్వరగా  కోలుకోవాలనికోరుకుంటూ కవులు, రచయితలు నభారాకు నివాళి అర్పించారు.

నమిలికొండ బాలకిషన్ రావు  హఠాన్మరణం అత్యంత బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో, సుక్కపొడుపు సంకలనంలో ఆయన పాత్ర మరువలేనిది.  బాలకిషన్ రావు కు శ్రద్ధాంజలి. కుటుంబ సభ్యులకు, మిత్రులకు  సానుభూతి - నందిని సిధారెడ్డి 

వరంగల్ సాహిత్య వాతావరణాన్ని ఆరోగ్యవంతం చేస్తూ తోచిన‌ వనరుల్ని సహ రచయితలకు అందిస్తూ సంపద్వంతం చేసిన విశాల హృదయుడు, నికార్సయిన మానవతావాది, భోళాశంకరుడు మా బాలకిషన్ కు నా శ్రద్ధాంజలి - రామా చంద్రమౌళి

నమిలికొండ బాల కిషన్ రావు గారు సాహిత్యం పట్ల మక్కువతో ఎన్నో సాహిత్య కార్యక్రమాల్ని నిర్వహించారు. మిత్రుడు పొట్లపల్లి, బాలకిషన్ రావు సంయుక్తంగా వరంగల్ లో సాహితీ సమితి అనే సంస్థ ద్వారా చాలా పనులు చేశారు. తన పరిధిలో ' ప్రసారిక ' ను నడిపారు. ఎంతో స్నేహశీలి. సాహిత్యంలో  విశేష కృషి చేసిన వారి పట్ల ఎంతో గౌరవంగా వుండేవారు. 1989 నుంచి ఆయనతో నాకు స్నేహం వుంది. ఆయన పలకరించే తీరులోని మృదుత్వం ప్రత్యేకమైంది. స్వభావరీత్యా ఆయన నిగర్వి అని నా అభిప్రాయం. నేను వరంగల్ లో వున్నన్నాళ్లు తరుచుగా కలుసుకున్నాము. ఆ జ్ఞాపకాలు నాలో తాజాగా వున్నాయి ఈనాటికీ.  ఓరుగల్లు పట్టణం ఒక సహృదయుణ్ణి కోల్పోయింది.  ఆయనకు ఇదే నా నివాళి - దర్భశయనం శ్రీనివాసాచార్య.

ఆత్మీయ మిత్రులు , సాహిత్యాన్ని శ్వాసగా భావిస్తూ జీవించిన నమిలికొండబాలకిషన్ రావుగారి ఆకస్మికమరణం వ్యక్తిగతంగానాకు , ఓరుగల్లు సాహితీప్రియులందరికీ తీరనిలోటే !!!!! ఆ పరాత్పరుడు వారికి ఉన్నతగతులు కల్పించాలని వేడుకుంటూ ...జి. గిరిజామనోహర్ బాబు

Follow Us:
Download App:
  • android
  • ios