రాజ్యం సామాన్యుడి వశమై మరో చరిత్ర ఆరంభమవుతుంది అంటూ డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత ' అంగడి... ' ఇక్కడ చదవండి :
చెమటోడ్చి కష్టంతో
శ్రమకోర్చి యంత్రంతో
రూపొందిన వస్తువులన్నీ
ఒకచోట చేరి కనిపించే
వినిమయ దృశ్య సంచయం
పట్నంలో పెద్ద అంగడి
అన్ని కొనేయాలనిపించినా
ఆర్ధికం సహకరించాలి కదా..!
వస్తువులేమో బోలెడు
కోర్కెలేమో బారెడు
స్థోమతేమో చారెడు
ఏదైనా కొనే స్థాయి
ఎప్పుడొస్తుందో ఈ చేతికి
కొనుగోలు ప్రపంచంలో
నా పేరుకొక అవకాశం ఎప్పటికో...!
ధరల ధరణిలో
వినియోగదారుడిగా నాకు
సముచిత స్థానం ఎప్పుడో..!
గుండె మూలలో ఎప్పుడూ
ఒక ధీమా పోరాడుతూనే ఉంటుంది
మార్పు జరిగి తీరుతుంది
ధరాజ్యం సామాన్యుడి
వశమై మరో చరిత్ర ఆరంభమవుతుంది
Add Asianetnews Telugu as a Preferred Source

