దిగజారిపోతున్న మానవ విలువలను దేవనపల్లి వీణావాణి కవితలో చదవండి. 

మనుషుల్ని ఇలా చూడడం ..
నాకు కొత్తేమీ కాదు
కొత్తదల్లా తమను తామే
లోతుగా పాతిపెట్టుకోవడం

ఏదో పోగొట్టుకున్నవాడు 
గాలిలో చూపును తేలేసి వెదుకుతుంటాడు
ఆ చూపు లోచూపుగా మారడం తప్ప 
తీరం ఆనదు

లోకం 
రెండుగా విడిపోవడం వెనుక
చేవేళ్ళ మధ్య తిరిగే రంగు కాగితాల నాట్యం ఉంటుంది
వాటి రెప రెపల శబ్దానికి మురికి ఉన్నా
విలువ మారదు

మనుషులు మనుషులుగా కాక
పోగుపడ్డ దేహాలుగా మాత్రం మిగిలి
చివికిన నెత్తురు నుంచి
సువాసన పీల్చడం నేర్చుకున్నారు

బలం అనుకున్నవాడు
నిజాన్ని తునకలుగా విడగొట్టి 
ఒక్కొక్కటిగా 
గెలుస్తాడు

మనం తునకల్లో ఉన్నాం కనుక
గెలువక పోవచ్చు
ఓడిపోవడం కూడా నాకు కొత్త కాదు
మసి పోసుకున్న గెలుపు కన్నా
తోక చుక్కలా రాలిపోవడమే గొప్ప కదా..

అలా
రాలిన తోక చుక్కల్ని చూడడమూ నాకు కొత్త కాదు..

లోతుల్లోంచి ఎగసిన దుఃఖానికి 
కంపించే నేల మీద పడిపోయిన
హార్మ్యాల నిశిరాసులను 
లెక్కించడమూ నాకు కొత్త కాదు

కొత్తదల్లా వేలం పాటకు నిలబెట్టుకున్న విలువలే .!