అన్యాయాలను ప్రశ్నిస్తే అవార్డు కోల్పోతామనీ తమను తాము గాంధారి పాత్రలో జీవిస్తున్నారు అంటూ దాసరి మోహన్ రాసిన కవిత ‘అంధుల శాతం అమాంతంగా…’ ఇక్కడ చదవండి : 

పక్కన బాలింతరాలు నిలుచుండి వున్నా
మొబైల్ లో తలదూర్చి తనకు 
కనపడనట్లు
మనిషి తాత్కాలికంగా అంధుడు అయిపోతాడు

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పత్రికలు అన్నీ పాపాలు బట్వాడా 
చేస్తున్నాయి
టీవీలు డబ్బా కొట్టి మరీ ఘోరాలు గొల్లు
మంటున్నావి
కిరాతకాలను కామన్ అనుకుంటూ కళ్ళు 
తెరవడు

అన్యాయాలను ప్రశ్నిస్తే అవార్డ్ 
కోల్పోతామనీ
తమకు తాము గాంధారి పాత్రలో 
జీవిస్తున్నారు
కొందరి కవుల పెన్ను మూసుకుని
పోయింది

సిగ్నల్ దగ్గర చిల్లర కోసం చేయి చాపితే
కళ్ళు కరుణ కోల్పోతాయి కొన్ని క్షణాలు
మనసు మసకబారిపోతుంది రోజురోజుకి

సంపద చేకూరి కళ్ళు నెత్తికి ఎక్కుతాయి
పదవి వరించి కళ్ళు కుర్చీకి అతుక్కుని
అహం సైంధవుడు అడ్డువస్తాడు

ఎవరి స్వార్థం వారికి ఎవరి లాజిక్ వారికి
కనబడి కనపడనట్లు కనబడి బాధ్యత కాదన్నట్లు
దేశంలో అంధుల శాతం అమాంతంగా పెరిగింది…