కరీంనగర్ యువతకు స్థానిక మంత్రి గంగుల కమలాకర్ శుభవార్త అందించారు. సొంత పట్టణంలోనే సాఫ్ట్ వేర్  ఉద్యోగాలు చేసుకునే అరుదైన అవకాశం కరీంనగర్ యువతకు దక్కనుందని గంగుల తెలిపారు.   

కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ ఐటీ టవర్ ను ప్రారంభించనున్నట్లు మంత్రి గంగుల ప్రకటించారు. ఈ మేరకు తుది నిర్మాణ పనులను ఆయన ఇవాళ పరిశీలించారు. ఐటీ అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. దాదాపు 3000 మంది యువతకు ఇక్కడ ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కరీంనగర్ ఐటీ టవర్ నిర్మాణం 90 శాతం పూర్తయి ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఇవాళ ఈ టవర్ ను రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. 30వ తేదీన రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ టవర్ ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. కేటీఆర్ తోపాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్ లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 

ఐటీ టవర్ నిర్మాణ తుది దశ పనుల పరిశీలన సందర్భంగా ఐటీ శాఖ అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు ఐటీ శాఖ అధికారులు, భవన నిర్మాణ కాంట్రాక్టర్, మాజీ డిప్యూటీ మేయర్ రమేశ్, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 

read more దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాల అప్పగింతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ... కరీంనగర్ ప్రజలకు ఇది శుభవార్త అని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగరానికి ఐటీ టవర్ కేటాయించారని మంత్రి గంగుల చెప్పారు. హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. 

కరీంనగర్ వాసులు ఇక్కడే ఉద్యోగం చేసుకునే విధంగా ఈ టవర్ ఉపయోగపడుతుందని అన్నారు. ఐదు ఫ్లోర్ల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో రిసెప్షన్, క్యాంటీన్... మిగిలిన ఫ్లోర్లలో కార్యాలయాలు ఉంటాయన్నారు. ఇప్పటికే 11 కంపెనీలతో ఎంవోయూలు పూర్తికాగా మరిన్ని కంపెనీలు కూడా కరీంనగర్ వస్తున్నాయని చెప్పారు. 

ఐటీ శాఖ అధికారులు 21వ తేదీ నుంచి కార్యాలయాల ఏర్పాటుపై పర్యవేక్షణ జరుపుతారని అన్నారు. 28రాత్రి వరకు అన్ని పనులు పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. దాదాపు 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలు వస్తాయి కాబట్టి నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 

read more శీతాకాల విడిది కోసం హైద్రాబాద్‌కు చేరుకొన్న రాష్ట్రపతి కోవింద్

30వ తేదీన ఓపెనింగ్ తోపాటు ఇంటర్వూలు కూడా నిర్వహిస్తారని అన్నారు. కరీంనగర్లో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. ఈ ఐటీ టవర్లో కార్యాలయాలు పూర్తిగా ఎస్టాబ్లిష్ అయి అన్నీ సవ్యంగా జరగడం ప్రారంభమైన తర్వాత రెండో టవర్ కూడా నిర్మించేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అన్నారు. 

హైసెక్యూరిటీ జోన్ గా ఐటీ టవర్ ను రూపొందించామని ఉద్యోగులకు భద్రక కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్లో ఐటీ టవర్ ప్రారంభం అనేది తనకెంతో గర్వకారణమని... కరీంనగర్ విద్యార్థులు, ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని గంగుల చెప్పారు.