పెళ్లి ఫొటోలన్నీ తీసి.. వరుడి ముందు చిందులేస్తూ డిలీట్ చేసిన ఫొటోగ్రాఫర్.. కారణమేంటంటే?
ఫ్రెండ్ పెళ్లికి ఫొటోలు తీయడానికి వెళ్లిన ఫొటోగ్రాఫర్కు పొద్దున నుంచి ఆహారం, కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. 20 నిమిషాల బ్రేక్ కావాలంటే కూడా నిరాకరించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఫొటోగ్రాఫర్ అప్పటి వరకు తీసిన పెళ్లి ఫొటోలన్నీ వరుడికి చూపిస్తూ డిలీట్ చేసి ఇక నేను నీ ఫొటోగ్రాఫర్ కాదంటూ బయటకు వెళ్లాడు. రెడ్డిట్లో చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతున్నది.
న్యూఢిల్లీ: పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. ఆ మధురక్షణాల జ్ఞాపకాలనీ జీవితాంతం భద్రపరుచకోవాలనుకుంటారు దంపతులు. అందుకే పెళ్లి ఫొటోలు, వీడియోలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. కొందరు ప్రతి తంతును మళ్లీ మళ్లీ కేవలం ఫొటోలు, వీడియోల కోసమే చేసేవారున్నారు. ఇప్పుడైతే ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. పెళ్లి జరుగుతుండగానే అప్పటి వరకు తీసిన ఫొటోలన్నీ ఫొటోగ్రాఫర్ డిలీట్ చేస్తే.. అది కూడా వరుడికి చెప్పి ఆయన ముందు ఆగ్రహంతో చిందులేస్తూ డిలీట్ చేసి నేను ఫొటోగ్రాఫర్ కాదు అని చెబితే..? ఇలాంటి షాకింగ్ ఘటనే స్వయంగా ఫొటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ ఫొటోలు డిలీట్ చేయడానికి కారణమేంటో తెలుసుకుందామా?
‘నిజానికి నేను ఫొటోగ్రాఫరే కాదు. కుక్కలను ప్రేమగా పెంచుకునే డాగ్ లవర్ని. ప్రతి రోజు చాలా వరకు కుక్కల ఫొటోలనే తీస్తుంటాను. వాటిని నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అప్లోడ్ చేసుకుంటుంటా. అది నాకు ఇష్టమైన పని’ అని ఆయన రెడ్డిట్లో పోస్టు చేశాడు.
‘నా ఫ్రెండ్ ఒకడు, వాడి పెళ్లి ఫొటోలు తీయమని నన్ను అడిగాడు. నేను వాడికి క్లియర్గా చెప్పా. నాకు అందులో ప్రావీణ్యం లేదురా అని. కానీ, వాడు కూడా ఆ ఫొటోలు పర్ఫెక్ట్గా రాకున్నా పర్లేదు అని అన్నాడు. సరే అని 250 అమెరికన్ డాలర్లతో బేరం కుదుర్చుకుని వాడి పెళ్లి ఫొటోలు తీయడానికి వెళ్లాను’ అని తెలిపాడు.
తక్కువ డబ్బులతో ఫొటోలు తీయించుకోవాలని ఆ పెళ్లి అనుకున్నాడు. అందుకే మిత్రుడితో బేరమాడాడు. ఆ మిత్రుడు ఉదయం 11 గంటలకు పని మొదలుపెట్టాడు. రాత్రి 7.30 గంటలకల్లా ఫొటోలు తీసే పని దాదాపు అయిపోతుంది.
‘ఉదయాన్నే ఫొటోలు తీయడం ప్రారంభించాను. తీస్తూనే ఉన్నాను. సాయంత్రం 5 గంటలు అవుతున్నది. నా తిండి, తిప్పలు పట్టించుకునే నాథుడే లేడు. తినడానికి వెళ్తానని అంటే.. నాకు ఫొటోగ్రాఫర్ కచ్చితంగా అవసరమని తెగేసి చెబుతున్నాడు. అసలు తినడానికి నాకు ఒక టేబుల్ కూడా రిజర్వ్ చేయలేదు’ అని ఫొటోగ్రాఫర్ వివరించాడు.
‘పనిచేయడం చాలా కష్టంగా మారింది. నేను బాగా అలసిపోయాను. అక్కడ వేడి విపరీతంగా ఉన్నది. కనీసం నాకు నీళ్లు కూడా ఇచ్చేవారు లేరు. ఇక తప్పక వరుడి దగ్గరకు వెళ్లి ఒక 20 నిమిషాల బ్రేక్ కావాలని, ఏదైనా తింటానని చెప్పాను. కాని నా ఫ్రెండ్.. అదే వరుడు నాకు షాక్ ఇచ్చాడు. ఉంటే ఫొటోగ్రాఫర్గానే ఉండాలని లేదంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుంటే అక్కడి నుంచి వెళ్లి పోవాలని ఆదేశించాడు’ అని తెలిపాడు.
‘అదే విషయాన్ని మరోసారి అడిగాను.. నీవు నిజంగానే అంటున్నావా? అంటే ఔను అని అన్నాడు. దీంతో నాకు కోపం నషాళానికి చేరింది. వాడి ముందే, వాడికి చూపిస్తూనే ఫొటోలన్నీ డిలీట్ చేశాను. నేను ఫొటోగ్రాఫర్ను కాదు అని బయటకు వచ్చేశా’ అని వివరించాడు.
‘వాడి పెళ్లి ఫొటోలు తీస్తే నాకు 250 డాలర్లు ఇస్తా అన్నాడు. కానీ, ఆ టైమ్లో నాకు ఒక గ్లాస్ కూల్ వాటర్ ఇచ్చినా 250 డాలర్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతటి దురవస్థ అది’ అని వివరించాడు. రెడ్డిట్లో పోస్ట్ చేసి అభిప్రాయాలు అడిగాడు. దీనికి ఫొటోగ్రాఫర్కు మద్దతుగా నిలిచినవారే ఎక్కువగా ఉన్నారు. తిండినే వద్దన్నోడి పని చేయాల్సిన అవసరం లేదని కొందరు, ఫొటోలు డిలీట్ చేయకుండా తర్వాతైనా ఎక్కువ డబ్బుకు ఇస్తే బాగుండేదని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.