పాకిస్తాన్ కు టీటీపీ కౌంటరిచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై టీటీపీ కౌంటరిచ్చింది.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు తెహ్రిక్-ఇ-తాలిబన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. బలూచిస్తాన్ లో తిరుగుబాటుకు ఆఫ్ఘనిస్తాన్ సహాయం చేస్తుందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) కౌంటరిచ్చింది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటనలపై పంజ్షిరి తాలిబాన్ కమాండర్ అబ్దుల్ హమీద్ ఖోరాసాని స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. టీటీపీ యోధులు త్వరలోనే ఆ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని పాకిస్తాన్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. ముల్లా హెబతుల్లా ఆదేశిస్తే పాకిస్తాన్ భూమి నుండి తుడిచిపెట్టుకుపోతుందని కూడ ఆయన వ్యాఖ్యానించారు. బలూచిస్తాన్ లో తిరుగుబాటుకు ఆఫ్ఘనిస్తాన్ సహాయం చేస్తుందని జనరల్ మునీర్ ఆరోపించారు.ఈ వ్యాఖ్యల తర్వాత ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం సాగుతుంది.
పాకిస్తాన్ లోని ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో చర్చ సందర్భంగా జనరల్ మునీర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. బలూచీస్తాన్ లో తిరుగుబాటుకు ఆప్ఘనిస్తాన్ మద్దతు ఇస్తుందని మునీర్ ఆరోపించారు. మన వాళ్లు చరిత్ర చదవరు. పాకిస్తాన్ వైపు చూడకండి. ప్రతి దానిని త్యాగం చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ మునీర్ చెప్పారు.
తాలిబాన్ ప్రభావం,చర్యలకు సంబంధించి పాకిస్తాన్ సైనిక వ్యవస్థలో పెరుగుతున్న అసంతృప్తికి ఆర్మీచీఫ్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇస్లామాబాద్, కాబూల్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి పాకిస్తాన్ లో అభద్రతా భావం పెరిగిందని అధికారిక డేటా సూచిస్తుంది. టీటీపీ దాడులతో గత మూడేళ్ల కాలంలో పలువురు సాయుధ బలగాలు, పౌరులు మరణించారు.