ఆహారంలో బొద్దింకలు.. పాకిస్తాన్లో పార్లమెంట్ క్యాంటీన్కు సీల్
పాకిస్తాన్ పార్లమెంట్ హౌస్ క్యాంటీన్లలో తయారైన ఆహారంలో బొద్దింకలు దర్శనమివ్వడంతో అధికారులు ఆ క్యాంటీన్లను మూసివేశారు
పాకిస్తాన్ పార్లమెంట్ హౌస్ క్యాంటీన్లలో తయారైన ఆహారంలో బొద్దింకలు దర్శనమివ్వడంతో అధికారులు ఆ క్యాంటీన్లను మూసివేశారు. ఇక్కడ నాసిరకం ఆహారం అందుబాటులో వుంచుతున్నందున ఇప్పటికే చాలా మంది ఎంపీలు ఇక్కడి ఆహారాన్ని తీసుకోవడం మానేశారు. కొద్దిరోజుల క్రితం ఆహారంలో బొద్దింకలు ఉండటాన్ని గుర్తించిన ఎంపీలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు రెండు క్యాంటీన్లలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆహారాన్ని తీసుకునే పురుగులు , వంట గదిలో అపరిశుభ్రత అనారోగ్యానికి దారి తీసే పరిస్ధితులు వున్నట్లు పేర్కొన్నారు. ఆ రెండు క్యాంటీన్లకు అధికారులు సీల్ వేశారు. అయితే పాకిస్తాన్లోని క్యాంటీన్లలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. 2014లో ఓ కెచప్ సీసాలోనూ బొద్దింక కనిపించింది. ఇక్కడ ఉపయోగిస్తున్న మాంసంలో నాణ్యత గురించి ఎంపీలు పలుమార్లు గళమెత్తారు కూడా.