జైల్లో కుల్భూషణ్ జాదవ్ను కలిసిన భారత అధికారి
పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న కుల్భూషణ్ జాదవ్ ను భారత అధికారి సోమవారం నాడు కలిశారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న కుల్భూషణ్ జాదవ్ను భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియా సోమవారం నాడు కలిశారు. అంతర్జాతీయ కోర్టు ఆదేశాలతో జాదవ్ను కలిసేందుకు పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది.
2017 తర్వాత కుల్భూషణ్ను కలిసేందుకు భారత అధికారులకు పాకిస్తాన్ అవకాశం కల్పించింది.భారత నౌక దళంలో అధికారిగా పనిచేసిన కుల్భూషణ్ జాదవ్ ను పాక్లో గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. అంతేకాదు ఈ కేసులో ఆయనకు పాక్ కోర్టు ఉరి శిక్ష విధించింది.
పాక్ కోర్టు తీర్పుపై ఇండియా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ఏడాది జూలై 17వ తేదీన అంతర్జాతీయ న్యాయ స్థానం పాక్ ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. పాక్ తీరును అంతర్జాతీయ న్యాయస్థానం తప్పుబట్టింది.
అంతర్జాతీయ న్యాయ స్థానం ఆదేశాలతో భారత డిప్యూటీ హై కమిషనర్ ను కలిసేందుకు పాక్ అంగీకరించింది. దీంతో సోమవారం నాడు జాదవ్ ను గౌరవ్ కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.