ఎట్టకేలకూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విశ్వాసపరీక్షలో నెగ్గారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 41% మంది చట్టసభ సభ్యులు అతనికి వ్యతిరేకంగా ఓటు వేశారు.
లండన్ : బ్రిటీష్ ప్రధాన మంత్రి Boris Johnson సోమవారం విశ్వాస పరీక్ష ఓటులో విజయం సాధించారు. "partygate" కుంభకోణంపై ఇంటా, బయటా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధానికి ఇది కాస్త ఊరట కలిగించింది. అయితే ఈ కుంభకోణంతో సొంత పార్టీ Conservative Partyలోనే పెద్ద తిరుగుబాటు జరిగింది. ఇదే ఆయన అధికారాన్ని పెద్ద దెబ్బతీసింది. మద్దతును తిరిగి పొందేలా పోరాటం చేయాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో జాన్సన్ భారీ విజయాన్ని సాధించారు. అయితే, COVID-19 మహమ్మారి నేపథ్యంలో బ్రిటన్ లాక్డౌన్లో ఉన్నప్పుడు అతను, సిబ్బంది డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయంలో, నివాసంలో లిక్కర్ పార్టీలు నిర్వహించడంతో ఒత్తిడి పెరిగింది.
పార్టీగేట్ కుంభకోణంతో దుమారం రేగడంతో దేశాన్ని పాలించే విషయంలో ఆయన నాయకత్వం, అధికారం మీద అనేక ప్రశ్నలను లేవనెత్తిన సొంతపార్టీ వారే 41శాతం మంది చట్టసభ సభ్యులు ప్రజలలో అతని స్థాయిని పడగొట్టారు. కానీ రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మాస్టర్ అయిన జాన్సన్ ఈ విశ్వాస ఓటును "నిర్ణయాత్మక ఫలితం"గా అభివర్ణించారు. "ప్రభుత్వంగా, మనం ముందుకు సాగవచ్చు. ప్రజలకు నిజంగా ముఖ్యమైనదని నేను భావించే విషయాలపై దృష్టి పెట్టవచ్చు" అన్నారు.
కొద్ది వారాలుగా పార్టీగేట్ కుంభకోణంనుంచి ప్రజల దృష్టి మరిల్చేందుకు బోరిస్ జాన్సన్ ఎక్కువగా ప్రజాసేవా కార్యక్రమాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. "ప్రజలు సుఖంగా జీవించడానికి ఏం సహాయం చేస్తున్నాం, COVID బ్యాక్లాగ్లను క్లియర్ చేయడానికి ఏం చేస్తున్నాం, వీధుల్లో, కమ్యూనిటీల్లో పోలీసుల భద్రతను ఎక్కువ చేయడం ద్వారా ఎలాంటి రక్షణ కల్పిస్తున్నాం’ అనే అంశాల మీదే చెబుతున్నారు.
ఈ అవిశ్వాస తీర్మానం తలకిందులవుతున్న జాన్సన్ అదృష్టాన్ని సూచిస్తుంది. ఆయన మీద పెరుగుతున్న వ్యతిరేకతను తెలుపుతుంది. ఇక, 211 మంది శాసనసభ్యులు జాన్సన్కు అనుకూలంగా 148 మంది ఓటు వేశారు. మూడు దశాబ్దాల్లో అవిశ్వాస తీర్మానంలో కన్జర్వేటివ్ల నుంచి ఈ స్థాయిలో అతిపెద్ద మెజారిటీని గెలుచుకున్నది బోరిస్ జాన్సనే. అయినా కూడా ఆయన ప్రధానమంత్రిగా కొనసాగడం ఘోరంగా ఉందని పలువురు చట్టసభ సభ్యులు తెలిపారు.
"ఈ ఓటింగ్లో బోరిస్ జాన్సన్కు ఉపశమనం కలుగుతుంది. అయితే పార్టీ ఐక్యతను పునర్నిర్మించడమే తదుపరి ప్రాధాన్యత అని కూడా అతను అర్థం చేసుకుంటాడు" అని మాజీ మంత్రి డేవిడ్ జోన్స్ రాయిటర్స్తో అన్నారు. ఇంకొకరు స్పందిస్తూ ఇది ప్రజలు ఊహించిన దానికి భిన్నంగా ఉంది.. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించడం తొందరపాటు అవుతుందన్నారు. జాన్సన్ కు బద్ధ విమర్శకుడైన రోజర్ గేల్ ప్రధానికి ఉద్దేశించి మాట్లాడుతూ "ఈ రాత్రికి తిరిగి డౌనింగ్ స్ట్రీట్కి వెళ్లండి. అక్కడి నుంచే ఇక ముందు ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించండి’ అని తెలిపారు.
బోరిస్ జాన్సన్ కు 12-నెలల విరామం..
విశ్వాస ఓటింగ్లో గెలుపొందడం ద్వారా మరో 12నెలలపాటు ఎలాంటి అడ్డంకీ బోరిస్ జాన్సన్ కు ఉండదు. చట్టసభ సభ్యులు మరో సవాలును అతనిమీద తీసుకురావాలంటే కనీసం 12 నెలల సమయం పడుతుంది. దీంతో బోరిస్ జాన్సన్ కు ఉపశమనం లభించినట్లైంది. కానీ అతనికంటేముందు బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన థెరిసా మే 2018 విశ్వాస ఓటులో మెరుగ్గా స్కోర్ చేసినా.. ఆరు నెలల తర్వాత రాజీనామా చేసింది.
