కోమటిరెడ్డి పట్టు: షర్మిల పార్టీ విలీనానికి ముహూర్తం ఖరారు..!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీకి కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. ఇందుకు సంబంధించి వైఎస్ షర్మిలకు, కాంగ్రెస్ అధిష్టానంల మధ్య కూడా ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీకి కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. ఇందుకు సంబంధించి వైఎస్ షర్మిలకు, కాంగ్రెస్ అధిష్టానంల మధ్య కూడా ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 18వ తేదీన కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా తన భర్త అనిల్కుమార్తో కలిసి ఢిల్లీ వెళ్లిన షర్మిల.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం, రాజకీయ పరిణామాలు, విలీనంపై పెట్టిన షరతులపై చర్చలు సాగినట్టుగా తెలుస్తోంది.
<p>Congress flag</p>
అయితే షర్మిల నిబంధనలపై ఏఐసీసీ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సహా ప్రముఖ కాంగ్రెస్ నేతలతో షర్మిల మరో దఫా చర్చలు జరపనున్నారని సమాచారం. షర్మిలను తెలంగాణ, ఏపీకే పరిమితం చేయొద్దని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకన్నట్టుగా తెలుస్తోంది. మరో రాష్ట్రం నుంచి ఆమెను రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్టుగా సమాచారం.
ys sharmila
కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనంలో డీకే శివకుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక భూమిక పోషించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ షర్మిల.. బెంగళూరులో కలిసి చర్చలు జరిపారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొన్నినెలల క్రితం బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ను కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనంపైనే ఇరువురు నేతల మధ్య చర్చ సాగిందనే ప్రచారం సాగింది. ఇక, 2021 జూలై 8 (మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి)న వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీని స్థాపించారు.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ పర్యటన ముగించుకున్న వైఎస్ షర్మిల శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో శంషాబాద్ చేరుకున్న షర్మిలను మీడియా చుట్టుముట్టింది. విలీనం వార్తలపై ప్రశ్నించగా.. ఆమె చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. అయితే తనను పార్టీలోకి ఆహ్వానించినందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ పర్యటన బాగానే సాగింది.. అన్ని వివరాలు తర్వాత చెబుతానని ఆమె పేర్కొన్నారు.
అంతకుముందు కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం, షర్మిల చేరిక తదితర అంశాలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు కాంగ్రెస్ లోకి ఎప్పుడైనా ఆహ్వానం వుంటుందన్నారు. షర్మిలను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నానని కోమటిరెడ్డి చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేసిందని ఆయన ప్రశంసించారు. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే లాభమే జరుగుతుందని వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిల వల్ల 4 ఓట్లు వచ్చినా.. 400ఓట్లు వచ్చినా లాభమేనని ఆయన వ్యాఖ్యానించారు.
అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత పార్టీదేనని వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కూతురిగా షర్మిలకు కాంగ్రెస్ లో ఎప్పుడైనా ఆహ్వానం వుంటుందని కోమటిరెడ్డి అన్నారు. షర్మిల చేరికపై పార్టీ హైకమాండ్ అడిగినప్పుడు ఇదే చెబుతానని వెంకట్ రెడ్డి తెలిపారు . ఒకరికొకరు కలిసి బలపడాలని కాంగ్రెస్ భావిస్తోందని కోమటిరెడ్డి పేర్కొన్నారు.