భర్త జల్సాలకు అలవాటు పడి.. అప్పులు చేస్తున్నాడని.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య..
భర్త జల్సాలకు అలవాటు పడి.. అప్పులు చేస్తూ ఇంటిని పట్టించుకోవడంలేదని విసుగుచెందిన ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. సుపారీ ఇచ్చి మరీ అతడిని హత్య చేయించింది.
నల్గొండ : నాలుగు రోజుల క్రితం నల్గొండలో జరిగిన హత్యోదాంతంలో భార్య నిందితురాలిగా తేలడంతో అందరూ నివ్వెరపోయారు. పట్టణ శివారులోని మిషన్ కాంపౌండ్ దగ్గర రఘురాములు అనే వ్యక్తి హత్య జరిగింది. అతడి హత్యకు భార్యే కారణమని తేలింది. దేవరకొండ పోలీస్ కార్యాలయంలో డిఎస్పి నాగేశ్వరరావు ఈ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
రఘురాములు స్టాంప్ వెండర్ గా పనిచేస్తున్నాడు. నగరంలోని విష్ణు కాంప్లెక్స్ లో కిడ్స్ వేర్ దుకాణం కూడా ప్రారంభించాడు. ఈ దుకాణం బాధ్యతను భార్య శ్రీలక్ష్మి చూసుకునేది. అటు ఉద్యోగం, ఇటు దుకాణంతో రఘురాములు జల్సాలకు అలవాటుపడ్డాడు. అప్పులు చేయడం మొదలుపెట్టాడు. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. కిడ్స్ వేర్ బాధ్యత చూసుకుంటున్న శ్రీలక్ష్మికి ఇది చాలా విసుగును పుట్టించింది. భర్త ప్రవర్తన ఎప్పటికీ మారకపోవడంతో అతడిని అంతమొందించాలని భావించింది.
దీనికోసం హైదరాబాదులో ఉంటున్న స్నేహితురాలి భర్తతో పరిచయం పెంచుకుంది. భర్తను చంపడం కోసం అతడి సహాయం కావాలని కోరింది. దీనికోసం అతనితో ఇంస్టాగ్రామ్ కాల్ లో మాట్లాడేది. అలా చిలక రాజు అరుణ్ అనే అతనితో భర్తను చంపడం కోసం రూ.5 లక్షలకు సుపారి మాట్లాడుకుంది.
పథకంలో భాగంగా చిలక రాజు అరుణ్ దగ్గర తన భర్త రఘురాములకు అప్పు ఇప్పించింది. వారిద్దరూ పరిచయమై దగ్గరయ్యేలా చూసింది. ఇక అతడిని చంపే పథకంలో భాగంగా.. మూడు నెలల క్రితం రఘురాములకు మధ్యంలో టాబ్లెట్ కలిపి ఇచ్చింది. కానీ అది పనిచేయలేదు. ఆ తర్వాత రెండోసారి ఓ వాహనంతో ఢీ కొట్టి చంపాలని ప్రయత్నించినా.. దానికి ఎక్కువ డబ్బులవుతాయని వెనకాడారు.
చివరికి జూన్ 26వ తేదీన చిలక రాజు అరుణ్ తన స్నేహితులు హైదరాబాదులోని సంతోష్ నగర్ కు చెందిన ముక్కెర భాను, సరూర్నగర్ కు చెందిన పెనుగొండ రవితేజలతోపాటు మరో గుర్తు తెలియని మహిళతో కలిసి దేవరకొండకు వచ్చారు. ఆ తర్వాత తన దగ్గర తీసుకున్నరూ.50వేలు కావాలని రఘురాములుకి ఫోన్ చేశాడు.అతను స్కూటీ మీద మిషన్ కాంపౌండ్ దగ్గరికి వచ్చిన తర్వాత అతనితో గొడవపడి.. బండి మీద నుంచి కింద పడేశారు.
ఆ తర్వాత కదలకుండా చేసి రఘురాములు నోట్లో, ముక్కులో అరుణ్ సైనేడ్ పోశాడు. దీంతో రఘురాములు ఊపిరాడక చనిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ కు పారిపోయారు. రాత్రి 10 గంటల సమయంలో శ్రీలక్ష్మికి ఇన్స్టాగ్రామ్ కాల్ చేసి నీ భర్తను హత్య చేశామని అరుణ్ చెప్పాడు. రఘురాములు హత్య విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఈమెరకు వివరాలు తెలిసాయి.