జీహెచ్ఎంసీ ఎన్నికలు: జనసేన పోటీ ఎవరికి లాభం?
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ ఏ పార్టీకి లాభం చేకూర్చుతోంది.. ఎవరికి నష్టం చేస్తోందోననే విషయమై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకొంది. సుమారు 60కిపైగా స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దింపాలని జనసేన భావిస్తోంది. జనసేనతో ఎలాంటి పొత్తు ఉండదని బీజేపీ తేల్చి చెప్పింది. దీంతో ఈ ఎన్నికలపై మరింత ఆసక్తి నెలకొంది.
డిసెంబర్ 1వ తేదీన జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది.ఈ మేరకు జనసేన చీఫ్ రెండు రోజుల క్రితం ఈ విషయమై ప్రకటన చేశారు.
ఏపీ రాష్ట్రంలో బీజేపీ, జనసేనలు అసెంబ్లీ ఎన్నికలవరకు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి.కానీ తెలంగాణలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు దూరంగా ఉన్నాయి.
2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో ఏపీలో , తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.
2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉంది. కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది.
పవన్ కళ్యాణ్ అభిమానులు, యూత్ ఎక్కువగా జనసేన వైపునకు మొగ్గు చూపుతారని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఏ మేరకు జనసేన దీన్ని ఓటు రూపంలోకి మల్చుకొంటుందనేది ప్రశ్న.
నగరంలో ఎక్కువగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. నగరంలోని 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువ నియోజకవర్గాల్లో సెటిలర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది.
గతంలో సెటిలర్లు ఎక్కువగా టీడీపీకి అండగా ఉండేవారు. 2014 నుండి తెలంగాణలో టీడీపీ బలహీనపడుతున్న నేపథ్యంలో ఈ దఫా సెటిలర్ల ఓట్లు ఎటువైపు మొగ్గు చూపుతాయనేది కూడ ఆసక్తికరంగా మారింది.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో సెటిలర్ల ఓట్ల భద్రత కోసం టీఆర్ఎస్ కట్టుబడి ఉందనే కీలక ప్రకటన కేసీఆర్ చేశారు. ఆ సమయంలో సెటిలర్ల ఓట్లు టీఆర్ఎస్ వైపునకు మొగ్గు చూపాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన వెంటనే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు.
జనసేన ఎక్కువగా సెటిలర్ల ఓట్లతో పాటు యూత్ ఓట్లపైనే ఆశలు పెట్టుకొంది. గత ఎన్నికల నాటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే టీడీపీ బరిలోకి దిగుతోంది.
బలహీనంగా ఉన్న టీడీపీ కనీసం 60 స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది. గత ఎన్నికల్లో కూకట్పల్లిలోని ఒకే స్థానంలో ఆ పార్టీ గెలిచింది. ఈ దఫా ఆ పార్టీ పట్ల ప్రజలు ఏ రకంగా చూస్తారనేది ఫలితాలు తేల్చనున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ లో పోటీ చేసిన 8 స్థానాల్లో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి కనీసం 16 శాతం ఓటు బ్యాంకు ఉందని అంచనా. అయితే ఆ ఓటు బ్యాంకును నిలుపుకొంటుందా.. ఇతర పార్టీలకు ఈ ఓటు బ్యాంకు మల్లుతుందా అనేది ఫలితాల తర్వాత తేలనుంది.టీడీపీ, జనసేనలు కూడ సెటిలర్ల ఓట్లపైనే ఫోకస్ చేస్తే ఎవరి వైపు ఆ ఓటర్లు మొగ్గు చూపుతారనేది ఫలితాలు తేలుస్తాయి.
రాష్ట్రంలో రెండో దఫా కూడ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సెటిలర్లకు ఎలాంటి ముప్పు లేదనే భరోసాను ఆ పార్టీ కల్పించింది. కీలకమైన సమయాల్లో టీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు.
నగరంలో ఉండేవారంతా తమ వారేనని కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ రకమైన ప్రకటనల తర్వాత ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారికి గులాబీ నేతలు భరోసా కల్పిస్తున్నారు.
జనసేన పోటీ చేయడం వల్ల యువత ఓట్లు ఏ మేరకు తమవైపునకు తిప్పుకోనుందో కూడ తేలాల్సి ఉంది. గంపగుత్తగా జనసేన అభ్యర్ధులకు యూత్ ఓటింగ్ మళ్లుతోందా అంటే చెప్పలేం. యూత్ ను తమ పార్టీకి ఓటు చేసేలా జనసేన అభ్యర్థులు తీసుకొస్తే రాజకీయంగా బీజేపీకి కొంత నష్టమనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ కు పరోక్షంగా ప్రయోజనం జరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
ఈ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు కూడ ప్రభావం చూపే అవకాశం ఉంది. స్థానికంగా సమస్యలు... వాటి పరిష్కారం కోసం ఆయా పార్టీలు, అభ్యర్ధులు చేసే ప్రచారాలు కూడ గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి.
ఇక ఎక్కువ పార్టీలు పోటీ చేయడం వల్ల విపక్షాల మధ్య ఓట్ల చీలిక రాజకీయంగా తమకు ప్రయోజనం కల్గించే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం అధికార పార్టీకి కలిసివచ్చే అవకాశాలు లేకపోలేదు.