యువకుడి ప్రాణాలు కాపాడి... మానవత్వాన్ని చాటుకున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్
రోడ్డు ప్రమాదానికి గురయి ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడివున్న వ్యక్తిని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్.
వరంగల్: మనిషి ప్రాణం కంటే ఏదీ ఎక్కువకాదు. ప్రాణాపాయ స్థితిలో వున్న వారిని కాపాడటం సాటి మనిషిగా మన బాధ్యత అని నిరూపించారు సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. తన బిజీ షెడ్యూల్ ను కూడా పక్కనబెట్టి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడటానికి తనవంతు ప్రయత్నం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా ఆరేపల్లి వద్ద ఓ ద్విచక్రవాహదారుడు రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. అయితే అతడు రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడివున్నా జనాలు గుమిగూడారే తప్ప హాస్పిటల్ కు తరలించాలని ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. ఇదే సమయంలో నర్సంపేట లో కార్యక్రమాలను పూర్తి చేసుకుని వరంగల్ తిరిగి వెళుతున్న వినోద్ కుమార్ తీవ్ర గాయాలతో రోడ్డుపై పడివున్న వ్యక్తిని గమనించారు.
వెంటనే తన కారును నిలిపి గాయాలపాలైన వ్యక్తిని వైద్యం కోసం హాస్పిటల్ కు తరలించారు. తానే దగ్గరుండి అతడిని కారులో ఎక్కించారు. ఇంతటితో తన పని అయిపోందని భావించకుండా ఆ యువకుడి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు వినోద్ కుమార్ సూచించారు.
ఓ సామాన్యుడి ప్రాణాలను కాపాడటానికి మాజీ ఎంపీ వినోద్ చూపిన చొరవ అందరూ అభినందిస్తున్నారు. రాజకీయ నాయకులంటే ప్రజా సేవకులన్న విషయాన్ని కొందరు ఇప్పటికే మరిచిపోగా... వినోద్ కుమార్ వంటి వారు అప్పుడప్పుడు ఇలా మానవత్వాన్ని చాటుతూ ప్రజాసేవను గుర్తుచేస్తున్నారు.