మీ అకౌంట్లో ఇంకా రైతు భరోసా డబ్బులు పడలేదా? కారణం ఇదేనేమో చెక్ చేసుకోండి?
మీకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పొందేందుకు అన్ని అర్హతలు వున్నాయా? అయినా మీ అకౌంట్లో డబ్బులు పడలేదా? అయితే అందుకు కారణం ఇదేనేమో తెలుసుకొండి... ఇలా ఈజీగా సమస్యను పరిష్కరించుకోండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rythu Bharosa
Rythu Bharosa : తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రైతు భరోసా' ప్రారంభమయ్యింది. రైతుల ఖాతాల్లో జనవరి 27 నుండి పెట్టుబడి సాయం డబ్బులు పడతాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నాలుగు పథకాలను రేవంత్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా పథకం అమలు ప్రక్రియను స్టార్ట్ చేసారు.
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని ఎంపికచేసి ఈ పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఇలా తన సొంత నియోజకవర్గం కొడంగల్ లోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఈ నాలుగు పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇవాళ(ఆదివారం) అర్థరాత్రి 12 గంటల తర్వాత అంటే జనవరి 27 నుండి పెట్టుబడి సాయం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని స్వయంగా ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసారు.
గణతంత్ర దినోత్సవం రోజున జాతీయజెండా సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాపై చేసిన ప్రకటన రైతులకు ఆశలు రేకెత్తించింది. ఇవాళ(సోమవారం) ఖాతాలో ఎప్పుడు డబ్బులు పడతాయి... ఈ మేసేజ్ తమ ఫోన్ కు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే రైతు భరోసా డబ్బులు కొందరి ఖాతాల్లో పడగా మరికొందరు రైతులకు ఇంకా రాలేవు. డబ్బులు రాలేవని రైతులు కంగారుపడాల్సిన అవసరం లేదు... ఎందుకు రాలేవో తెలుసుకునే ప్రయత్నం చేయండి.
Rythu Bharosa
రైతు భరోసా రాకపోడానికి ఇవే కారణాలై వుండవచ్చు...
1. గతంలో మాదిరిగా భూమి వున్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా లభించదని... కేవలం వ్యవసాయం చేసే రైతులకే పెట్టుబడి సాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే పంటలు పండిస్తున్న భూముల వివరాలను ప్రభుత్వం సేకరించారు అధికారులు. కాబట్టి భీడుభూములు, రియల్ ఎస్టేట్,కొండలుగుట్టలు... ఇలా వ్యవసాయేతర భూములకు రైతు భరోసా వర్తించదు. మీరు అలాంటి భూమిని కలిగివుంటే మీకు రైతు భరోసా రాదు.
2. గతంలో మాదిరిగానే విడతల వారిగా రైతు భరోసా విడుదల చేయనున్నారు. అంటే మొదట ఎకరంలోపు రైతులకే పెట్టుబడి సాయం డబ్బులు పడనున్నాయి. అంటే ఇవాళ(సోమవారం) చిన్న సన్నకారు రైతుల ఖాతాల్లోనే డబ్బులు పడే అవకాశాలున్నాయన్నమాట. తర్వాత ఎకరంన్నర, రెండెకరాలు, ఐదెకరాలు... ఇలా విడతల వారిగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది.
3. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారికి ఈ నెల చివరివరకు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం వుంది. ఇలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది... కాబట్టి మీరు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటే కాస్త ఆలస్యమయ్యే అవకాశం వుంది.
4. గతంలో బ్యాంక్ అకౌంట్ వివరాల్లో తప్పుల కారణంగా రైతు భరోసా ఆలస్యమైనవారు సమస్యల పరిష్కారానికి తగిన పత్రాలను అందించాలని వ్యవసాయ అధికారులు కోరారు. ఈ ప్రక్రియ కూడా జనవరి చివరివరకు కొనసాగనుంది. కాబట్టి బ్యాంక్ ఖాతా, ఇతర సాంకేతిక సమస్యలు కలిగినవారికి కూడా రైతు భరోసా ఆలస్యం అవుతుంది.
5. రైతు భరోసాకు అర్హత కలిగిన భూముల సర్వే ఇటీవలే చేపట్టారు అధికారులు. సర్వే నంబర్ల వారిగా పంటలు పండించని భూములను గుర్తించి పెట్టుబడి సాయం కట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతోంది. కాబట్టి రైతు భరోసా ఆలస్యం కావచ్చు.
ఇలా వివిధ కారణాలతో రైతు భరోసా ఆలస్యం కావచ్చు. కాబట్టి రైతులెవరూ కంగారు పడవద్దు... కొన్నిరోజులు వేచివుండాలి. అయినాకూడా పెట్టుబడి సాయం డబ్బులు పడకుంటే ఎందుకు పడటంలేవో తెలుసుకొండి. రైతు భరోసా సమస్యలుంటే ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకొండి.
Rythu Bharosa
రైతు భరోసా సమస్యలకు పరిష్కార మార్గాలు :
రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించే భూముల విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో రైతు భరోసాకు అర్హత లేని భూముల సర్వే నంబర్లు బైటపెట్టారు. అంటే ఈ భూములకు తప్ప మిగతా భూములన్నింటికి రైతు భరోసా వర్తిస్తుంది... ఆ రైతులకు ఎకరాకు ప్రతిఏడాది రూ.12 వేలు వస్తాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది మొదటి విడతలో ఎకరాలు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి... ఇవాళ్టి నుండే ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
అయితే పెట్టుబడి సాయానికి అన్ని అర్హతలు కలిగివున్నా మీకు డబ్బులు రాకపోతే ఏం చేయాలో తెలుసుకొండి. సమస్యను తొందరగా పరిష్కరించుకుంటే తొందరగా డబ్బులు పొందే అవకాశం వుంటుంది. కాబట్టి రైతు భరోసా సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో తెలుసుకుందాం.
1.రైతు భరోసాకు మీకు అన్ని అర్హతలుంటే మీరు కంగారుపడాల్సిన అవసరం లేదు. రైతు భరోసా రాకుంటే వెంటనే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి. మీరు సాగుచేసే భూమి, పంట వివరాలను వ్యవసాయ అధికారులకు అందించండి. సమస్య ఏంటో తెలియజేయాలని కోరండి. వ్యవసాయ శాఖ పరిధిలోనే సమస్య వుంటే పరిష్కరించుకొండి.
2. బ్యాంక్ అకౌంట్ సమస్యల కారణంగా కూడా రైతు భరోసా అందకపోవచ్చు. కాబట్టి మీరు రైతు భరోసాకు అటాచ్ చేసిన అకౌంట్ కలిగిన బ్యాంక్ శాఖను కూడా ఓసారి సంప్రదించండి.తద్వారా ఏదయినా సమస్య వుందేమో తెలుసుకుని పరిష్కరించుకోవచ్చు.
3. అన్ని అర్హతలు కలిగివుండి మీకు రైతు భరోసా డబ్బులు రాలేవంటే అందుకు సాంకేతిక కారణాలు కూడా కారణమై వుండవచ్చు. కాబట్టి అవేంటో గుర్తించడం ద్వారా మీరు సమస్యను పరిష్కరించుకే మార్గాలను కనుగొనవచ్చు.
4. రైతు భరోసాకు సంబంధించిన నియమ నిబంధనలు తెలుసుకొండి. వాటిప్రకారం మీరు అర్హులో కాదు తేల్చుకోవచ్చు. పెట్టుబడి సాయానికి అర్హులైతే ఎందుకు డబ్బులు రాలేవో వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకోవచ్చు.
ఇలా రైతు భరోసా డబ్బులు రాని రైతులు అందకు గల కారణాలు, వాటి పరిష్కార మార్గాన్ని తెలుసుకొండి. పెట్టుబడి సాయం డబ్బులను పొంది వ్యవసాయాన్ని మరింత అభివృద్ది చేసుకొండి. తద్వారా రైతులు కూడా మంచి లాభాలను పొందవచ్చు.