Telangana MLC Elections 2025 : విజయశాంతి, అద్దంకి, శంకర్ నాయక్ లే ఎందుకు? : కాంగ్రెస్ వ్యూహం అదిరిందిగా
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికను బట్టే ఈ విషయం అర్థమవుతోంది. అసలు విజయశాంతి, అద్దంకి దయ్యాకర్, శంకర్ నాయక్ లనే ఎందుకు ఎంపిక చేసారో తెలుసా?

Telangana MLC Elections 2025
Telangana MLC Elections 2025 : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కావడం ఖాయమయ్యింది. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి అధికార కాంగ్రెస్ కు 4, ప్రతిపక్ష బిఆర్ఎస్ కు ఒకసీటు దక్కనుంది. ఈ ఐదు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు... ఇవాళ వీళ్లు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నామినేషన్లకు మార్చి 10 అంటే ఇవాళే(సోమవారం) చివరి తేదీ. ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులే నామినేషన్ వేయనున్నారు... కాబట్టి ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలన్ని ఏకగ్రీవం కానున్నాయి.
అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సహజంగా ఓసిలు మరీముఖ్యంగా రెడ్డిల డామినేషన్ కాంగ్రెస్ లో ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి పార్టీ నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్కటికూడా ఓసిలకు కేటాయించపోవడంతో ఆసక్తికర పరిణామం. అసలు ఎన్నికలే లేకుండా ఈజీగా దక్కే ఈ ఎమ్మెల్సీ పదవికోసం చాలామంది ఓసి నాయకులు ప్రయత్నించారు... కానీ కాంగ్రెస్ మాత్రం వారికి అవకాశం ఇవ్వలేదు. ఎస్సి, ఎస్టి, బిసి నాయకులకే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ బలాన్నిబట్టి చూస్తే ఐదిట్లో నాలుగు ఎమ్మెల్సీలు ఆ పార్టీకే దక్కుతాయి. అయితే ఇందులో ఓ సీటును మిత్రపక్షం సిపిఐకి ఇచ్చారు. మిగతా మూడు స్థానాలకు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ కు కేటాయించారు. ఇలా బిసి, ఎస్సి, ఎస్టి నాయకులకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి సామాజిక న్యాయం చేసింది. అంతేకాదు మిత్రపక్షం సిపిఐ కూడా బిసి నాయకుడు నెల్లికంటి సత్యంకు అవకాశం ఇచ్చింది.

Telangana Congress
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహమిదేనా?
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా బిసిలదే. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో ఈ విషయం స్పష్టంగా బైటపడింది. ఇక ఎస్సి, ఎస్టిల జనాభా కూడా రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అయితే ఈ వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రతిపక్ష బిజెపి గట్టిగానే ప్రయత్నిస్తోంది. బిసి సీఎం నినాదం, ఎస్సీ రిజర్వేషన్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు అందులో భాగమే. కేంద్ర ప్రభుత్వ సాయంతో బిజెపి బిసి, బలహీనవర్గాలను ఆకర్షిస్తోంది.
బిజెపి ప్రయత్నాలు పలించి బిసి, ఎస్సి, ఎస్టీలు కాషాయం వైపు మళ్లితే కాంగ్రెస్ కు కష్టాలు తప్పవు. అందువల్లే కాంగ్రెస్ కూడా ఈ వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలను ప్రారంభించింది. అందులో భాగమే తెలంగాణ పిసిసి చీఫ్ గా బిసి నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడమైనా, కులగణన చేపట్టి బిసి రిజర్వేషన్లు పెంచే చర్యలయినా, ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన అయినా.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటోంది... ఇది కేవలం రెడ్డిల పార్టీ కాదు అందరి పార్టీ అని. ఇలా సామాజిక న్యాయం ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. త్వరలో స్థానికసంస్థలు జరగనున్న నేపథ్యంలో భారీ ఓటుబ్యాంక్ కలిగిన బిసి,ఎస్సి, ఎస్టీ సామాజికవర్గాలను ప్రసన్నం చేసుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ రెడ్డిల పార్టీ అనే భావనను తొలగించే ప్రయత్నం చేస్తోంది.
ఇటీవల కాలంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను బట్టి ఓ విషయం మాత్రం స్ఫష్టంగా అర్థమవుతోంది... త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కూడా బిసిలు, అణగారిన వర్గాలకు ప్రాధాన్యత దక్కుతుందని. ఇది మంత్రిపదవి ఆశించే బడా ఓసి నేతలకు మింగుడుపడని విషయమే.
addanki dayakar, vijayashanti, shankar nayak
విజయశాంతి, అద్దంకి, శంకర్ నాయక్ లే ఎందుకు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమయంలోనే ఆమెకు మంచి పదవిని ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్సీని చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల టాక్.
ఇక అద్దంకి దయాకర్ కు కూడా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పదవి హామీ వచ్చింది. తుంగతుర్తి అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకుని అంతా సిద్దంచేసుకున్నాక చివరి క్షణంలో ఆయనను తప్పించింది కాంగ్రెస్. ఈ క్రమంలోనే స్వయంగా ఆనాటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు భవిష్యత్ లో మంచి పదవిని హామీ ఇచ్చారు. ఇప్పడు దాన్ని నిలబెట్టుకుంటూ అద్దంకిని మండలికి పంపిస్తున్నారు.
ఇక బలహీనవర్గాలకు దగ్గరయ్యే వ్యూహంలో భాగంగానే సామాన్య ఎస్టీ నాయకుడు శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ మారుమూల తండానుండి రాజకీయాలు ప్రారంభించిన శంకర్ నాయక్ అంచెలంచెలుగా ఎదిగారు. 2019 వరకు నల్గొండ డిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన అతడికి తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కింది.