గవర్నర్ తమిళిసై ప్రజాదర్భార్పై రాజకీయ దుమారం.. నేరుగా యాక్షన్లోకి దిగినట్టేనా..?
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తలపెట్టిన ప్రజాదర్భార్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. గవర్నర్ తమిళిసై తన పరిధి దాటుతున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. రాజకీయ కార్యాకలాపాల కోసం రాజ్భవన్ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తలపెట్టిన ప్రజాదర్భార్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే రాజ్భవన్లో గవర్నర్ ఫిర్యాదుల విభాగం ఉందని.. అలాంటప్పుడు గవర్నర్ ప్రజా దర్భార్ నిర్వహించాలని అనుకోవడం ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని కొందరు టీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేస్తున్నారు. అయితే అధికారికంగా టీఆర్ఎస్ నుంచి స్పందన మాత్రం వెలువడలేదు.
గవర్నర్ తమిళిసై తన పరిధి దాటుతున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. రాజకీయ కార్యాకలాపాల కోసం రాజ్భవన్ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారని కామెంట్ చేశారు.
అయితే గవర్నర్ తమిళిసై తీసుకుంటున్న నిర్ణయాలు.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టిన కేసీఆర్.. ఆ సమయంలో రాష్ట్ర గవర్నర్గా ఉన్న నరసింహాన్తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సమయంలో కేంద్రంలోని బీజేపీతో కూడా కేసీఆర్ వైరం లేదు.
కానీ 2019 లో తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్గా వచ్చాక సీన్ మారిపోయింది. కొద్ది రోజులు బాగానే సాగిన.. నామినేటెడ్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకున్న తర్వాత.. ప్రగతిభవన్ వర్సెస్ రాజ్ భవన్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్న అంశం హైలెట్ అయింది.
ఆ తర్వాత రిపబ్లిక్ డే వేడుకలు, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకపోవడం, గవర్నర్ ప్రోటోకాల్ వివాదం, రాజ్భవన్లో ఉగాది వేడుకలు.. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య దూరాన్ని పెంచుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లిన తమిళిసై.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో వేర్వురుగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. ఆ భేటీల తర్వాత తమిళిసై చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. ఆమె కామెంట్స్పై టీఆర్ఎస్ నాయకులు ఘాటుగానే స్పందించారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని.. ప్రజల చేత ఎన్నుకున్న ప్రతినిధులమని కౌంటర్ ఇచ్చారు. తమిళిసై బీజేపీ మూలాలను కలిగి ఉండటంతో రాజ్భవన్ను బీజేపీ రాజకీయాలకు కేంద్రంగా మార్చారని పలువురు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ అగ్రనేతలు ఆరోపించారు.
యాక్షన్లోకి తమిళిసై..!.. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా పరిస్థితులు మారాయి. మరోవైపు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పలు సంఘటనలపై స్పందిస్తున్న గవర్నర్.. సంబంధిత అధికారుల నుంచి నివేదికలు కోరుతున్నారు. అంతేకాకుండా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంతో పాటుగా వివిధ జిల్లాలో తమిళిసై పర్యటిస్తున్నారు. మతపరమైన ప్రదేశాలను సందర్శించడంతో పాటుగా.. అక్కడి ప్రజలతో మమేకమవుతున్నారు.
పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కూడా ఆమెకు ఆహ్వానం అందలేదు. దీంతో ఆ వేడుకలను తమిళిసై రాజ్భవన్లో కొద్ది మంది అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేక్ను కట్ చేశారు. పలువురు కళాకారులకు సన్మానం చేశారు. ‘ఈ రాష్ట్రం నాది.. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ను మాత్రమే కాదు.. మీ సహోదరిని’ అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై తమిళిసై సౌందర్రాజన్ నివేదిక కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ప్రజాదర్బార్ నిర్వహించాలని గవర్నర్ నిర్ణయించడంతో.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడంలో భాగంగానే.. ఢిల్లీ డైరెక్షన్లోనే తమిళిసై సౌందర్రాజన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి భవిష్యతుల్లో ఇంకా ఎలాంటి పరిణమాలు చోటుచేసుకుంటాయనేది వేచిచూడాల్సి ఉంది.
మహిళా దర్బార్.. ప్రజాదర్బార్లో భాగంగా ఈ నెల 10న ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తమిళిసై రాజ్భవన్లో ‘మహిళా దర్బార్’నిర్వహిస్తారని గవర్నర్ కార్యాలయం బుధవారం ప్రకటించింది. మరుగునపడిపోయిన మహిళల గొంతుకను ఆలకించడానికి గవర్నర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాజ్భవన్ పేర్కొంది. గవర్నర్ను కలవాలనుకుంటున్న మహిళలు 040–23310521 నంబర్కు ఫోన్ చేయడం ద్వారా గానీ, లేదా rajbhavan&hyd@gov.inకు మెయిల్ చేసి అపాయింట్మెంట్ పొందాలని మహిళలకు సూచించింది. ఇక, రానున్న రోజుల్లో గవర్నర్ తమిళిసై వివిధ వర్గాల ప్రజలతో నిత్యం ‘ప్రజా దర్బార్’లు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.