పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: జూరాలకు ఎగువన రిజర్వాయర్కు తెలంగాణ సర్కార్ ప్లాన్
తెలంగాణ ప్రభుత్వం జూరాల ప్రాజెక్టుకు ఎగువన రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జూరాల రిజర్వాయర్ కు ఎగువన రిజర్వాయర్ నిర్మాణం కోసం తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తోంది. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచితే మహబూబ్ నగర్,నల్గొండ జిల్లాలు నష్టపోయే అవకాశం ఉంది. దీంతో మహబూబ్ నగర్ జిల్లా అవసరాల కోసం ఈ రిజర్వాయర్ ను ప్రతిపాదిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచే ఉద్దేశ్యంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఈ నెల 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది. సుమారు 7 వేల కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూపొందించాలని ప్లాన్ చేసింది.
జూరాల ప్రాజెక్టుకు ఎగువన మరో రిజర్వాయర్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. జూరాల ప్రాజెక్టు సామర్ధ్యం 11 టీఎంసీలు. అయితే ఎప్పుడు కూడ 9 టీఎంసీల మాత్రమే నీటిని నింపుతారు.
జూరాల ప్రాజెక్టుకు బ్యాక్ వాటర్ కు అరకిలోమీటరు దూరంలో కొత్త రిజర్వాయర్ ను ప్రతిపాదిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల రిటైర్డ్ ఇంజనీర్లు జూరాల బ్యాక్ వాటర్ లో రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్ చేశారు.
గట్టు లిఫ్ట్ స్కీమ్ కు ప్రత్యామ్నాయంగా ఈ రిజర్వాయర్ ను ప్రతిపాదిస్తున్నారు. గట్టు, యార్లదొడ్డి, నాగర్ దొడ్డి గ్రామాల మధ్య ఈ రిజర్వాయర్ ను నిర్మించనున్నారు.ఈ రిజర్వాయర్ లో 20 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఐదు 40 మెగావాట్ల పంపులతో కృష్ణా నది నుండి నీటిని లిఫ్ట్ చేసి ఈ రిజర్వాయర్ ను నింపేలా ప్రతిపాదిస్తున్నారు.
రిజర్వాయర్ కట్ట పొడవు సుమారు 15 కి.మీ దూరం ఉండేలా ఇంజనీర్లు ప్రతిపాదిస్తున్నారు. జూరాల కుడి కాలువ, నెట్టెంపాడు, తుమ్మిళ్ల లిఫ్ట్, జూరాల ఎడమ కాలువ .భీమా,కోయిల్ సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న 3 లక్షల ఆయకట్టుకు ఈ రిజర్వాయర్ ద్వారా నీటిని అందించేలా ప్లాన్ చేస్తున్నారు.
జిల్లాలోని చాలా ప్రాజెక్టులు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి ప్రతిపాదించారు. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని ఏపీ ప్రభుత్వం పెంచితే తెలంగాణకు నీటి కష్టాలు తప్పకపోవచ్చని తెలంగాణ ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.ఈ తరుణంలో రిటైర్డ్ ఇంజనీర్లు నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందించారు.ఈ నివేదికపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.